Vande Bharat Passengers Alert: ప్రస్తుతం దేశంలో అత్యంత అధునాతన రైలుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. అదిరిపోయే సౌకర్యాలు, అత్యంత వేగవంతమైన ప్రయాణంతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, ఎల్ఈడీ లైటింగ్, వై ఫై, లేటెస్ట్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్ల లాంటి ప్రత్యేకతలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. అందుకే, వందే భారత్ లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ రైలులో ఉన్న ఆటోమేటిక్ డోర్లు కొన్నిసార్లు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రైలు బయలుదేరే సమయం దగ్గరపడగానే డోర్లు ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతాయి. దీంతో చివరి నిమిషంలో స్టేషన్ కు చేరుకున్న కొందరు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారు. మరికొందరు తమ కోచ్ దగ్గరికి చేరుకునేలోపే డోర్లు మూసుకుపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఇకపై వందేభారత్ డోర్లు క్లోజ్ అయితే, రైలును మిస్ కావాల్సిన అవసరం లేదు. కాస్త అవగాహన ఉంటే రైలును ఎక్కే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రయాణికుల కోచ్ల తలుపులు మూసుకుపోయినప్పటికీ, రైలు చివర భాగంలో ఉండే గార్డ్ కోచ్ కొంత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. మీరు ఆలస్యంగా స్టేషన్ కు చేరుకున్నట్లయితే వెంటనే ఆ చివరి కోచ్ వైపు వెళ్లాలి. అక్కడి నుంచి రైలులోకి వెళ్లి, మీకు కేటాయించిన సీటు ఉన్న కోచ్కు లోపల నుంచే నడుచుకుంటూ వెళ్లవచ్చు.
అదే సమయంలో ఎక్కువ లగేజీతో ప్రయాణించే వారికి మరో సమస్య ఎదురవుతుంది. వందే భారత్ రైళ్లు చాలా స్టేషన్లలో తక్కువ సమయం ఆగుతాయి. సామానుతో త్వరగా దిగడం కొంతమందికి కష్టం అవుతుంది. అలాంటి సందర్భాల్లో గార్డ్ సహాయం తీసుకోవచ్చు. అవసరమైతే చివరి కోచ్ వరకు వెళ్లి అక్కడి సిబ్బందికి విషయం చెప్పడం మంచిది.
నిజానికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దిగాల్సిన స్టేషన్ రావడానికి ముందే, బ్యాగులు సర్దుకోవాలి. రైలు స్టేషన్కు చేరుకునే కొద్ది నిమిషాల ముందే తలుపుల దగ్గరకు వెళ్లి సిద్ధంగా ఉండాలి. తొందరపాటు, గందరగోళం లేకుండా సులభంగా దిగే అవకాశం ఉంటుంది.
వందే భారత్ రైలు మొదటిసారిగా 2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణంతో మంచి ఆదరణ పొందాయి. 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాత్రి ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
Read Also: హైడ్రోజన్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. త్వరలో పట్టాలపై పరుగులు!