India-Bangladesh Train Services: భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ అంతర్జాతీయ రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైళ్లకు సంబంధించి తూర్పు రైల్వే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అధికారిక అనుమతి వచ్చిన తర్వాత రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కోల్ కతా–ఢాకా మధ్య నడిచే రైలు సేవల పునఃప్రారంభానికి సంబంధించి అధికారిక తేదీ ప్రకటించలేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా సేవలను ప్రారంభించేందుకు రేకులు, కోచ్ లను సిద్ధం చేసి ఉంచినట్లు చెప్పారు. కోచ్ల శుభ్రత, సాంకేతిక తనిఖీలు, మెయింటెనెన్స్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. బంగ్లాదేశ్లో గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా భారత్–బంగ్లాదేశ్ మధ్య నడిచే మైత్రి ఎక్స్ ప్రెస్, బంధన్ ఎక్స్ ప్రెస్, మిథాలీ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం మైత్రి, బంధన్ ఎక్స్ ప్రెస్ రేకులు కోల్ కతాలో సిద్ధంగా ఉన్నాయి.
రెండేళ్ల విరామం తర్వాత ఇటీవల బంగ్లాదేశ్ పౌరులకు భారత్ మళ్లీ పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ లోని భారత వీసా కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ ట్రీట్మెంట్, పర్యటన, వ్యాపార అవసరాల కోసం భారత్ కు వచ్చే బంగ్లాదేశ్ ప్రజలు రైలు సేవలు తిరిగి ప్రారంభం కావాలని భావిస్తున్నారు. విమాన ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో రైలు సేవలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులు మారుతున్న సమయంలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశమయ్యారు. ఆ తర్వాత న్యూ జల్పైగురి–ఢాకా మధ్య నడిచే మిథాలీ ఎక్స్ ప్రెస్ బోగీలు దాదాపు ఐదు నెలల తర్వాత భారతదేశానికి తిరిగి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఇంజిన్ చిలహటి సరిహద్దు ద్వారా వచ్చి హల్దీబారి స్టేషన్ లో బోగీలను విడిచిపెట్టి తిరిగి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ బోగీలకు క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు కొనసాగుతున్నాయని, సర్వీసులు ప్రారంభించేందుకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని చెప్పారు.
అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మైత్రి, బంధన్, మిథాలీ ఎక్స్ ప్రెస్ రైళ్లు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా వైద్యం, విద్య, వ్యాపారం, పర్యాటక అవసరాల కోసం ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
Read Also: మహిళను చూస్తూ అసభ్య సైగలు, వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!