Indian Railway: రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నవందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఈ నెలలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యంత వేగం, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రైళ్లను రూపొందించారు. దీర్ఘ, మధ్యస్థ దూర ప్రయాణాలకు దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను షెడ్యూల్ చేయనున్నారు. ఈ కొత్త రైలు దేశంలో ప్రజా రవాణాను మరింత వేగవంతం చేయనుంది.
వందే భారత్ స్లీపర్ ఓపెనింగ్ ఎప్పుడు?
ఈ నెలలోనే వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ లోని భావ్ నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రైలు ప్రారంభోత్సవానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలును త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. “వందే స్లీపర్ అతి త్వరలో వస్తుంది. సెప్టెంబర్ లో అందుబాటులోకి రావచ్చు” అన్నారు. ఈ నెల రెండో వారంలో లేదంటే చివరి వారంలో అందుబాటులోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ఫస్ట్ మోడల్ ఇప్పటికే తయారు చేయబడింది. అన్నిరకాల ఫీల్డ్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. ఈ రైలు ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని క్లియరెన్స్ లు లభించాయి. పట్టాలు ఎక్కడమే తరువాయి కానుంది.
వందేభారత్ స్లీపర్ ఫస్ట్ రూట్
దేశంలో పరుగులు తీసే తొలి రైలుకు సంబంధించి మార్గాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఇందుకు సంబంధించి పలు మార్గాలను ఎంపిక చేయగా, వాటిలో తొలి రూట్ కు సంబంధించి తుది నిర్ణయం రైల్వే బోర్డు తీసుకుంటుంది. ఢిల్లీ నుంచి పాట్నాకు తొలి స్లీపర్ రైలును నడపబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మీదుగా వెళ్లనుంది. ప్రీమియం రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన సౌకర్యాలు, ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ రైలు ఈ నెల చివరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో నడిచేలా రూపొందించబడింది.
Read Also: రైళ్లలో వైట్ బెడ్ రోల్స్ మాత్రమే ఎందుకు వాడతారు? తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!
వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు
వందే భారత్ స్లీపర్ రైలు ఇంటీరియర్స్ భారతీయ ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. సాధారణంగా విమానాలు, స్టార్ హోటల్ గదులలో కనిపించే సౌకర్యాలను కలిగి ఉంటాయి.USB ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్ మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లోపల డిస్ ప్లే ప్యానెల్స్, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు, వికలాంగుల ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లు లాంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఫస్ట్ ఏసీ కార్ లో వేడి నీటితో షవర్లను అందిస్తుంది. ఇది ప్రయాణీకుల సౌకర్యాన్ని మరింత పెంచుతుంది.
Read Also: రెండు నిండు ప్రాణాలు కాపాడిన మెట్రో, ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల తరలింపు!