Indian Railways Freight Services: భారతీయ రైల్వే సరుకు రవాణాపై మరింత దృష్టి కేంద్రీకరించింది. మరింత వేగంగా సరుకులను తరలించేలా ప్రత్యేక సరుకు రవాణా రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. భారతీయ రైల్వే ప్రతి ఏటా 1.6 బిలియన్ టన్నులకు పైగా సరుకు రవాణా చేస్తోంది. పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి బల్క్ వస్తువులు, ఆహార ధాన్యలు, వ్యవసాయ సంబంధ ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు సహా పలు రకాల సరుకును రవాణా చేస్తుంది. సుదూర ప్రాంతాలకు రోడ్డు రవాణా ద్వారా సరుకులు రవాణా చేయడం కంటే రైలు ద్వారా రవాణా చేయడం ద్వారా మరింత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంటుంది. రైలు ద్వారా సరుకు రవాణా చేయడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సాయపడుతుంది. హైవే రద్దీని కూడా తగ్గిస్తుంది.
సరుకు రవాణా కోసం గతి శక్తి రైళ్లు
దేశ వ్యాప్తంగా కార్గో తరలింపును వేగవంతం చేయడానికి, సరుకు రవాణా చైన్ ను మరింత బలోపేతం చేసే దిశగా రైల్వేశాఖ కీలక చర్యలు చేపడుతోంది. గూడ్స్ రవాణాకు సెమీ హై స్పీడ్ సేవలు అందించేలా గతి శక్తి సరుకు రవాణా రైళ్లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రైళ్లను చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తున్నారు. ఈ రైళ్లు అధునాతన కంటైనర్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, మెరుగైన సిబ్బంది సౌకర్యాలను కలిగి ఉన్న ఈ కామర్స్, FMCG లాజిస్టిక్స్ ను అందిస్తాయి. ఈ రైళ్లను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ICFజనరల్ మేనేజర్ సుబ్బారావు వెల్లడించారు.
ఏటా 1.6 బిలియన్ టన్నులకు పైగా సరుకు రవాణా
భారతీయ రైల్వే దేశంలో బల్క్ ట్రాన్స్ పోర్ట్ కు వెన్నెముకగా ఉంది. బొగ్గు, ఆహార ధాన్యాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు సహా మరిన్ని సరుకులను రవాణా చేస్తుంది. 2020-21లో 1,233 మిలియన్ టన్నుల నుంచి 2023-24లో 1,591 మిలియన్ టన్నులకు పెరిగింది. ఏకంగా 29 శాతం పెరుగుదల సాధించింది. అటు సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి, రైల్వే రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను నిర్మిస్తోంది. తూర్పు కారిడార్ లో లూథియానా నుంచి సోంనగర్ వరకు 1,337-కి.మీ.. పశ్చిమ కారిడార్ లో JNPT నుంచి దాద్రి వరకు 1,506-కి.మీ పరిధిలో నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ మార్గాల్లో ఇప్పటికే ప్రణాళిక చేయబడిన 2,843 కి.మీలలో, 2,741 కి.మీ కారిడార్లలో 96.4% అందుబాటులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,30,116 సరుకు రవాణా రైళ్లను తీసుకెళ్లనుంది.
Read Also: రైల్ వన్ యాప్ లో ఓటీటీ సేవలు.. ఫ్రీగా సినిమాలు చూసేయండి బ్రో!
కీలక విషయాలు వెల్లడించిన రైల్వేమంత్రి
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్ లో కీలక విషయాలు వెల్లడించారు. “భారతీయ రైల్వే కారిడార్ల విధానం ద్వారా దాని నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచే పనిలో ఉంది. HDN (హై ట్రాఫిక్ డెన్సిటీ), ఎనర్జీ, మినరల్స్, సిమెంట్ వంటి కారిడార్లను ప్రాధాన్యతపై అమలు చేస్తోంది” అని వివరించారు.
Read Also: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!