గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే అత్యాధునికంగా మారింది. పూర్తి స్వదేశీ టెన్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలో దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2030 కల్లా తొలి బుల్లెట్ రైలును నడిపించాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఈ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
భారత బుల్లెట్ రైలుకు చైనా మోకాలడ్డు!
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించి పలు చోట్ల భూగర్భంలో టన్నెల్స్ నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ నిర్మాణానికి అవసరమైన మూడు భారీ టన్నెల్ బోరింగ్ మిషన్లు చైనా షిప్ యార్డులో నిలిచిపోయాయి. ఈ యంత్రాలను జర్మన్ కంపెనీకి చెందిన హరెన్ క్నెక్ట్ నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. కానీ, ఇవి చైనాలోని గ్వాంగ్ జౌ ప్రాంతంలో తయారు చేశారు. రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికి, ఒక యంత్రం ఈ ఏడాది ప్రారంభంలో భారత్ కు రావాల్సి ఉంది. కానీ, చైనా అధికారులు వీటిని ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు వీటిని అడ్డుకుంటున్నారే విషయాన్ని చైనా వెల్లడించడం లేదు. వీటిని భారత్ కు రప్పించే ప్రయత్నం భారత్ చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
రూ.1.08 లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రూ. 1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. టన్నెల్ నిర్మాణ పనుల కోసం జర్మన్ కంపెనీకి మూడు TBM యంత్రాలను ఆర్డర్ ఇచ్చింది. ఈ మూడు యంత్రాలు చైనాలోని గ్వాంగ్ జౌ లో తయారయ్యాయి. కారణాలు చెప్పకుండా చైనా వీటిని అడ్డుకోవడంతో ఒక్క యంత్రమూ ఇండియాకు చేరుకోలేదు.
Read Also: నమో భారత్ vs వందేభారత్.. ఈ రైళ్ల మధ్య తేడా ఏంటి?
సొరంగ నిర్మాణ పనులకు ఆటంకం
ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లతోని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, సావ్లి మధ్య సొరంగ మార్గాన్ని నిర్మించబోతున్నారు. అయితే, అనుకున్న సమయానికి ఈ యంత్రాలు రాకపోవడంతో బుల్లెట్ రైలు నిర్మాణ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బాంద్రా కుర్లా కంప్లెక్స్ నుంచి షిల్ఫాటా వరకు 21 కి.మీ.. థానే క్రీక్ కింది భాగంలో మరో 7 కి.మీ. సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ బోరింగ్ మిషన్ల గురించి NHSRCL అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!