IndiGo Vijayawada Flights: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిసి విజయవాడ నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో విమాన సేవలను ప్రారంభించారు. ఈ కొత్త కనెక్టివిటీతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర, తూర్పు భారతదేశానికి ప్రయాణం మరింత ఈజీ కానుంది.
కొత్త షెడ్యూల్ ప్రకారం 6E6501 విమానం కోల్కతా నుంచి మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరి, 3:55 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 5:50 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 6E6502 విమానం విజయవాడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అనంతరం కోల్కతాకు బయలుదేరి రాత్రి 10:15 గంటలకు అక్కడికి చేరుతుంది. ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం రోజున, వారానికి మూడు రోజుల పాటు నడుస్తాయి.
కొత్త సర్వీసులకు తొలిరోజే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రారంభ రోజున వారణాసి నుంచి 89 మంది ప్రయాణికులు విజయవాడకు చేరుకోగా, విజయవాడ నుంచి 129 మంది వారణాసికి ప్రయాణించారు. వారణాసి, కోల్కతా నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కొత్త సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఆధ్యాత్మిక ప్రయాణాలతో పాటు వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అవసరాల కోసం కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందన్నారు.
విజయవాడ నుంచి దుబాయ్కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని బాలశౌరి కేంద్ర మంత్రిని కోరారు. దుబాయ్ విమాన సర్వీసు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు విదేశీ ప్రయాణాలు మరింత సులభమవుతాయని తెలిపారు. దుబాయ్ ని అంతర్జాతీయ హబ్గా ఉపయోగించుకుని యూరప్, అమెరికా, ఆఫ్రికా లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందన్నారు. అలాగే విజయవాడ నుంచి కొచ్చికి కొత్త విమాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
విజయవాడ విమాన కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. త్వరలో పుణె, అహ్మదాబాద్, కొచ్చిన్ నగరాలకు కూడా విమాన సర్వీసులు జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడ విమానాశ్రయాన్ని హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళిక కూడా ఉందని వెల్లడించారు. దీని ద్వారా ప్రయాణికులు ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలకు కనెక్టింగ్ విమానాలు ఎక్కే ముందు విజయవాడలోనే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
స్థానిక కళ, సంస్కృతిని ప్రతిబింబించేలా విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, హుస్సేన్ సాగర్, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో సీప్లేన్ సేవలను ప్రారంభించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: జస్ట్ 5 సెకన్లలో 800 కిమీ వేగం.. ఫ్యూచర్ బుల్లెట్ రైలు ఇదేనా?