Mumbai Railway Network: ముంబై వాసులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా 300 కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వసాయ్ లో అతిపెద్ద రైల్వే టెర్మినల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం ముంబైకి అందించిన రైల్వే అంశాలను వివరించే వీడియోను షేర్ చేశారు. ముంబై కోసం పలు రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడం పట్ల ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు తెలిపారు.
ముంబైలో 3,200 రైళ్ల సేవలు
ముంబైలో రోజూ 3200 రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ముంబై సెంట్రల్ తో పాటు వెస్ట్రన్ సబర్బన్ రైల్వే లైన్లలో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రతి రోజు సెంట్రల్ రైల్వే పరిధిలో సుమారు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వెస్ట్రన్ సబర్బన్ పరిధిలో 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వేశాఖ తగు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే కొత్తగా లోకల్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వసాయ్ ప్రాంతంలో భారీ టెర్మినల్ నిర్మాణం
ముంబైలో రైల్వే హబ్ మీద ప్రస్తుతం విపరీమైన భారం పడుతున్నది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వసాయ్ ప్రాంతంలో ఈ మెగా టెర్మినల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడి నుంచి సబర్బన్ రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు తమ ఆపరేషన్స్ ను కొనసాగించనున్నాయి. ప్రయాణీకుల రద్దీని తగ్గించడంలో ఉపయోగపడనుంది.
ముంబైలోని పలు రైల్వే అభివృద్ధి పథకాలకు ఆమోదం
ముంబైకి చెందిన పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబై పోర్టుకు కనెక్టివిటీని పెంచేందుకు స్పెషల్ గా కారిడార్ నిర్మించేందుకు ఓకే చెప్పింది. అటు పరేల్, ఎల్టీటీ, కల్యాణ్, పన్వేల్ టెర్మినల్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు అనుమతించింది. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్, బాంద్రా టెర్మినల్స్ ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. అటు జోగేశ్వరి, వసాయ్ రైల్వే టెర్మినల్స్ సబర్బన్ ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి.
5 ఏండ్లలో ముంబై రైల్వే ప్రాజెక్టులు పూర్తి
ముంబైలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు వచ్చే 5 సంవత్సరాలలో పూర్తికానున్నాయి. ఇవి పూర్తయితే ముంబైలో రైల్వే కనెక్టివిటీ గణనీయంగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రాజెక్టులతో ముంబైని రైల్వే కేంద్రంగా మార్చడమే కాకుండా, ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. రైల్వే ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద మొత్తంలో సీట్లు లభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను గిఫ్ట్ గా ఇచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Read Also: మెట్రో కొత్త కారిడార్లలో వచ్చే స్టేషన్స్ ఇవే.. మ్యాప్లతో సహా పూర్తి వివరాలు మీ కోసం!