Indian Railways: మౌని అమావాస్య నేపథ్యంలో ప్రయాగరాజ్ లో అమృత స్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. వెంటనే అధికారులు ప్రయాగరాజ్ సెక్టార్ 2లో కొద్ది గంటల పాటు పుణ్య స్నానాలను నిలిపివేశారు. అటు కుంభమేళాలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్రౌడ్ కంట్రోల్ కోసం మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. పలు రైళ్లను మధ్యలోనే ఆపివేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రైల్వేశాఖ స్పందించింది. కుంభమేళాకు సంబంధించి ఎలాంటి రైళ్లను క్యాన్సిల్ చేయలేదని తెలిపింది. అదనంగా ప్రయాగరాజ్ నుంచి భక్తులను తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేలా ఖాళీ రైళ్లను పంపుతున్నట్లు వెల్లడించింది.
మహా కుంభమేళా రైళ్ల రద్దు వార్తలు అవాస్తవం
రైళ్ల రద్దు గురించి వస్తున్న వార్తలను రైల్వే బోర్డు సమాచార, ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండించారు. “మేం కుంభమేళాకు సంబంధించిన ఎలాంటి రైళ్లను క్యాన్సిల్ చేయలేదు. నిలిపివేయలేదు కూడా. ప్రయాగరాజ్ లో ఉన్న భక్తల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. స్టేషన్ లో రద్దీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రయాగరాజ్ కు దాదాపు 360 రైళ్లను తరలిస్తున్నాం” అని తెలిపారు.
కుంభమేళాలో తొక్కిసలాట
మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రయాగరాజ్ సెక్టార్ 2లో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 15 మంది భక్తులు చనిపోగా, పలువురు గాయాపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు అంబులెన్సులలో క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ కు కాల్ చేసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేయాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు.
మౌని అమావాస్యలో అమృత స్నానం
మహా కుంభమేళాలో మౌని అమావాస్య నాడు స్నానం చేయడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి 144 సంవత్సరాల తర్వాత త్రివేణి యోగం అనే అరుదైన ఖగోళ అమరిక జరుగుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకుంది. కుంభమేళా సంప్రదాయం ప్రకారం, ‘సన్యాసి, బైరాగి, ఉదాసీన్ అనే మూడు వర్గాలకు చెందిన అఖాడాలు సంగమ ఘాట్ కు ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానం చేస్తారు. గంగా, యమునా, సరస్వతి సంగమాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మహా కుంభమేళా సమయంలో ముఖ్యంగా మౌని అమావాస్య రోజు ప్రత్యేక స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. తొక్కిసలాట నేపథ్యంలో మౌని అమావాస్య సందర్భంగా సంప్రదాయ అమృత స్నానాన్ని విరమించుకుంటున్నట్లు అఖాడాలు తెలిపారు.
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, మౌని అమావాస్య వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు!