Auto Drivers Marathi Rule: ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు ప్రాథమిక స్థాయిలో మరాఠీ భాష తెలిసి ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులతో మాట్లాడటం, వారు చెప్పేది అర్థం చేసుకోవాలంటే మరాఠీ నేర్చుకోవాల్సిందేనని వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు డ్రైవర్లలోనే కాకుండా చట్టపరమైన చర్చకు దారితీసింది.
ఆటో, టాక్సీ డ్రైవర్లు రోజంతా ప్రయాణికులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలి? ఏ మార్గంలో వెళ్లాలి? ఛార్జీ ఎంత? అనే విషయాల గురించి చర్చించాల్సి వస్తుంది. అయితే, కొందరు డ్రైవర్లు కనీస స్థాయిలో కూడా మరాఠీ మాట్లాడలేకపోతున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. మీరా-భయందర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో పలువురు డ్రైవర్లకు సాధారణ మరాఠీ కూడా తెలియదని అధికారులు గుర్తించారు. దీంతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠీపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.
ఈ ఏడాది మే 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 105 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 59 ఆర్టీఓ, సబ్ ఆర్టీఓ కార్యాలయాలు, భాషా శిక్షణ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. 4,500 మందికి పైగా ఉపాధ్యాయులు డ్రైవర్లకు ప్రాథమిక మరాఠీ నేర్పారు. ఎక్కడికి వెళ్లాలో అడగడం, డైరెక్షన్స్ చెప్పడం, ఛార్జీల గురించి మాట్లాడటం, ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లాంటి రోజువారీ మాటల గురించి శిక్షణ ఇచ్చారు. కోర్సు పూర్తి చేసి పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా అందించారు.
ముంబైలో సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, వారిలో 7,750 మంది పరీక్షలో విఫలమయ్యారు. మరో 14 వేల మందికి పైగా డ్రైవర్లు శిక్షణను ఇంకా పూర్తి చేయలేదు. దీంతో వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై డ్రైవర్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముంబైలో పనిచేస్తున్న చాలామంది డ్రైవర్లు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారేనని వారు చెబుతున్నారు. కొందరు వృద్ధులు, పరిమిత విద్య ఉన్నవారు కూడా ఉన్నారంటున్నారు. మరాఠీ నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడం మంచిదే. కానీ, పని కొనసాగించడానికి కఠినమైన షరతుగా మారకూడదని యూనియన్లు అంటున్నాయి. భాష రాకపోతే జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి రాకూడదంటున్నారు.
ఈ అంశం గతంలో కూడా కోర్టుకు వెళ్లింది. 2017లో ఆటోరిక్షా పర్మిట్ల కోసం మరాఠీ భాష తప్పనిసరి చేయడాన్ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం అలాంటి షరతు విధించడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయా? అనే ప్రశ్న తలెత్తింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఇది కొత్త నిబంధన కాదని, ఇప్పటికే ఉన్న నియమాలను అమలు చేస్తున్నామని చెబుతోంది. పర్మిట్లు, బ్యాడ్జ్ లకు సంబంధించిన నిబంధనలను సవరించే ప్రక్రియను కూడా చేపట్టింది.
మరాఠీ తెలియదని వెంటనే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయరు. ముందుగా నోటీసు ఇచ్చి, భాష నేర్చుకోవడానికి ఒక నెల సమయం ఇస్తారు. ఆ తర్వాత కూడా నిబంధన పాటించకపోతే PSV బ్యాడ్జ్, డ్రైవింగ్ లైసెన్సును మూడు నెలల వరకు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పదేపదే ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు భాషా, ఉపాధి, చట్టపరమైన అధికారాల మధ్య కొత్త చర్చకు కారణమవుతోంది.
Read Also: రైలెక్కిన ఆటో.. ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు!