సాధారణంగా ప్రాణాలు తీసేందుకు కొంత మంది దిండును ఆయుధంగా మార్చుకుంటారు. దిండును ముఖం మీద అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసిన సందర్భాలు చూశాం. కానీ, అదే దిండు ఓ మహిళ ప్రాణాను కాపాడింది. ఆ దిండును చూసి పోలీసులకు సమాచారం అందించిన ఫుడ్ డెలివరీ మ్యాన్ మీది సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ ఘటన ఆగస్టు 12న సౌత్ వెస్ట్రన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోని లెషాన్ లో జరిగింది. జాంగ్ అనే యువకుడు ఓ అపార్ట్ మెంట్ దగ్గర ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి నుంచి వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక తెల్లటి దిండును గమనించాడు. దానిపై రక్తం రాసి ఉన్న’110 625’ అనే నెంబర్ ను గుర్తించాడు. తనకు ఆ దిండు మీద ఏదో అనుమానం కలిగింది. ఇంకా చెప్పాలంటే భయం కలిగింది. వెంటనే తను పోలీసులకు సమాచారం అందించాడు. ఫుడ్ డెలివరీ మ్యాన్ సమాచారంతో పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. దిండును పరిశీలించారు. ఆ దిండు అపార్ట్స్ మెంట్స్ లోని 6వ బ్లాక్ 25వ అంతస్తులోని గది నుంచి పడినట్లు గుర్తించారు. ముందుగా ఏదైనా నేరం జరిగిందని భావించారు. కిడ్నాప్ వ్యవహారం అయి ఉండవచ్చు అనుకన్నారు. వెంటనే అపార్ట్ మెంట్ లోని సదరు గది నెంబర్ దగ్గరికి వెళ్లారు. తలుపు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు.
30 గంటలుగా గదిలో బంధించబడిన మహిళ
ఆ ప్లాట్ లోని బెడ్ రూమ్ లో హోం స్టే యజమాని జౌ 30 గంటలుగా చిక్కుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా గాలి వీయడంతో తలుపు మూతపడింది. బెడ్ రూమ్ లో ఉండటంతో కనీసం ఫోన్ యాక్సెస్ కూడా లేదు. బయటకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సాయం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. పక్క ప్లాట్స్ వాళ్లని అలర్ట్ చేయడానికి ప్రయత్నించింది. తలుపు కొట్టింది. పెద్దగా శబ్దం చేసింది. కిటికీ నుంచి ఎర్రటి క్లాత్ ను వేలాడదీసింది. తన మంచం నుంచి ఫోమ్ బోర్డులను కిందికి పడేసింది. కానీ, వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెలో టెన్షన్ పెరిగిపోయింది. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చివరికి ఆమె తన వేలును కొరికి రక్తాన్ని ఉపయోగించి తెల్లని దిండు మీద “110 625” అని రాసి కిటికీ లోనుంచి కిందికి పడేసింది. ఆ దిండును జాంగ్ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె బతికి బయటపడింది.
జాంగ్ కు నగదు బహుమతి అందించిన జౌ
తన ప్రాణాలను కాపాడటంతో కీలక పాత్ర పోషించిన ఫుడ్ డెలివరీ మ్యాన్ జాంగ్ కు జౌ కృతజ్ఞతలు చెప్పింది. అదేకాదు, 1,000 యువాన్ల నగదు బహుమతిగా అందించింది. అంతేకాదు, అతడు పని చేస్తున్న మీటువాన్ కంపెనీ అతనికి 2,000 యువాన్ల బహుమతితో పాటు ‘పయనీర్ రైడర్’ అనే గౌరవ బిరుదును అందించింది.
Read Also: తినే కంచాలపై మూత్రం పోసిన పని మనిషి.. వీడియో చూశారా?