AP New Ration card: మన జీవితం అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది. కొన్ని సంబంధాలు శాశ్వతంగా కొనసాగినా, కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోవడం ఒక అవసరంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో మన రోజువారీ జీవనానికి అవసరమైన పౌర సేవల్లో ముఖ్యమైనదిగా భావించే రేషన్ కార్డు కు సంబంధించి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్నవారు, లీగల్గా విడిపోయిన వారు కొత్తగా తమ పేరుతో రేషన్ కార్డు పొందాలంటే ఎలా? అవకాశం ఉందా? ప్రక్రియ ఏంటి? అనే అంశాలపై స్పష్టత లేకపోవచ్చు. ఇప్పుడు ఆ సందేహాలన్నింటికీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
అనుమానాలెన్నో..
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. దీనితో ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం ఎదురుచూపుల్లో ఉన్న ప్రజలు ప్రస్తుతం తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు. అయితే పలువురికి ఉన్న అనుమానాలను నివృతి చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
వారికి ఛాన్స్..
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయ సేవలు పౌరులకు మరింత సులభతరం చేస్తున్నాయి. విడాకులు తీసుకున్న మహిళలు, పురుషులు తమ విడాకుల లీగల్ డాక్యుమెంట్స్ ఆధారంగా కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు అర్హులు. అయితే, దానికి ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు జరగాలి. ముఖ్యంగా, గ్రామ వార్డు సచివాలయ హౌస్ మ్యాపింగ్ డేటాబేస్లో కుటుంబ విభజన జరిగి ఉండాలి. అంటే, మీరు ఉన్న ఇంట్లో ప్రస్తుత కుటుంబ సభ్యుల నుంచి మీరు విడిపోయారు అనే విషయం డేటాలో అప్డేట్ అయి ఉండాలి.
వివాహ బంధం ముగిసిన తర్వాత చాలామంది స్త్రీలు భౌతికంగా, ఆర్థికంగా పూర్తిగా వేరుగా జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములవ్వాలంటే వారు వేరుగా కుటుంబంగా గుర్తించబడాలి. రేషన్ కార్డు ఓ ప్రాథమిక గుర్తింపు డాక్యుమెంట్ కావడంతో, కొత్తగా దరఖాస్తు చేయాలంటే మున్సిపల్ సర్టిఫికేట్ లేదా కోర్ట్ విడాకుల ఉత్తర్వు వంటి లీగల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సమర్పించాలి.
ఇలా చేయండి..
ఒకవేళ హౌస్ మ్యాపింగ్ డేటాలో మీరు ఇప్పటికీ పాత కుటుంబ సభ్యుడిగా కనిపిస్తే, మొదటగా సచివాలయంలో కుటుంబ విభజన ఫారంను నింపాలి. అధికారుల పరిశీలన తరువాత కొత్త హౌస్హోల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాతే మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ అందుబాటులో ఉంది.
కొంతమంది మహిళలు తమ పిల్లలతో కలిసి విడిపోయిన తరువాత జీవిస్తున్నా, పాత కుటుంబానికి చెందిన కార్డులో వారి పేర్లు ఉన్నాయని ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికీ కొత్త కార్డు ద్వారా పౌష్టికాహారం, నిత్యావసరాల సరఫరా లాంటి పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విడాకులు తీసుకున్న మహిళలు పిల్లలతో కలిపి సొంతంగా జీవిస్తున్నా, వాళ్ల పేరు మీదే కొత్త కార్డు ఉండాలంటే ప్రభుత్వ డేటాలో అది అప్డేట్ కావాలి.
Also Read: Visakhapatnam Tourism: విశాఖలో అద్భుత నిర్మాణం.. తెలుసుకుంటే చేతులెత్తి మొక్కుతారు!
అధికారుల వద్ద ప్రాసెస్ ఇదే
ఈ దశలో సచివాలయ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO), లేదా విలేజ్ వెల్ఫేర్ అసిస్టెంట్ (VWA) లాంటి అధికారుల సహకారం కీలకంగా ఉంటుంది. వారు మీ కుటుంబ విభజన వివరాలను పరిశీలించి, అవసరమైన పరిశీలన తర్వాత నూతన హౌస్హోల్డ్ ఐడీను ఇవ్వగలరు. ఆపై మీ ఆధార్, విడాకుల డాక్యుమెంట్, నివాస ధృవీకరణతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు.
మొత్తానికి, విడాకులు తీసుకున్న వారికి లేదా లీగల్గా విడిపోయిన వారికి కొత్తగా రేషన్ కార్డు పొందడం పూర్తిగా సాధ్యమే. దానికి సంబంధించి మీరు స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలి, అవసరమైన ఆధారాలతో పాటు కుటుంబ విభజన హౌస్హోల్డ్ మ్యాపింగ్ డేటా అప్డేట్ చేయించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయితే, రేషన్ కార్డు మంజూరు అవుతుంది.
ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారికి ప్రభుత్వ పథకాల నుండి మద్దతు లభించేందుకు ఇది ఒక కీలక మార్గం. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ స్థితిలో ఉంటే, ఈ సమాచారాన్ని వినియోగించుకుని సచివాలయ సేవలను పొందండి. కొత్తగా రేషన్ కార్డు పొందండి. ప్రభుత్వ పథకాలలో భాగస్వాములవ్వండి. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు.