Beerla Ilaiah: స్వేచ్ఛ బ్యూరో: గత పదేళ్లలో సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా అనేక గ్రామాలకు తాగునీరు అందలేదని విమర్శించారు.
మిషన్ భగీరథ పనులకు పరిశీలించిన ప్రభుత్వ విప్..
మంగళవారం శామీర్పేట మండలంలోని ఘన్పూర్గుట్ట మిషన్ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్తో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. అధికారులతో పాటు కాంట్రాక్టర్లను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.1,212 కోట్లతో దాదాపు 2,030 గ్రామాలకు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో సుమారు 1,400 గ్రామాలకు నీరు అందలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీటికి పెద్దపీట వేస్తోందన్నారు.
దసరా నాటికి తాగునీటి సరఫరా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి , ఉత్తమ్ కుమార్ సహకారంతో ఢిల్లీకి వెళ్లి రూ.210 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. 16 కిలోమీటర్ల మేర సాగునీరు అందించాల్సిన పనుల్లో గతంలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన నాలుగు కిలోమీటర్లకు అటవీశాఖ అనుమతులు తీసుకున్నామని, పనులను వేగవంతం చేసి దసరాలోగా ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..
గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. అంతకు ముందు అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో OBC జిల్లా చైర్మన్ రవి ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ సత్యనారాయణ అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రమేష్,, డివిజన్ అధ్యక్షులు చాప రాజు, నాయకులు అశోక్ రెడ్డి ,రాజు నాయక్ ,సంతోష్ గౌడ్ , నారాయణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: మేమేం కుస్తీ పోటీలకు రావడం లేదు.. లోకేష్ సవాళ్లకు బొత్స కౌంటర్!