లోకేష్కు ప్రమోషన్పై టీడీపీలో కొనసాగుతున్న చర్చ
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను…ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్గా మారిపోయింది. లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసినా లోకేష్ ప్రమోషన్కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తునే ఉందట.
అనేక అంశాలు ముడిపడి ఉన్నాయంటున్న సీనియర్లు
లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవ్వడం వెనుకఅనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలు అంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడం…ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్ధితి. చంద్రబాబు పాలనలో బీజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్కు అప్పగించాలనే డిమాండ్ టీడీపీ నేతల నుంచి వస్తుంది. ఓ వైపు టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పందించాల్సిన పరిస్ధితి వచ్చింది.
లోకేష్కు ప్రజల మద్దతు ఉందంటున్న చంద్రబాబు
లోకేష్ని ఎపుడు టీడీపీ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు. 2029 ఎన్నికల్లోగా లోకేష్ని సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు.ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎపుడూ ముందుంటుందని తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ పార్లమెంట్ ఎంపీలల్లో అత్యధిక శాతం యువకులు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు.
లోకేష్ ప్రమోషన్పై అన్యాపదేశంగా స్పందించిన బాబు
ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావడం… తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదరదన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. తనకు నాలుగు సార్లు సీఎం గా ప్రజలు అవకాశం ఇచ్చారని అంటూనే.. లోకేష్కి కూడా జనాల మద్దతు ఉందంటూ అన్యాపదేశంగా లోకేష్ ప్రమోషన్పై స్పందించారు.
పొలిట్ బ్యూరోలే సంస్కరణలకు టైమ్ పడుతుందన్న లోకేష్
టీడీపీ యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండటంతో.. లోకేష్కు తర్వలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైందంట. కాస్తా అటూ ఇటు కావచ్చు, ఆలస్యం అయినా కావచ్చు కానీ లోకేష్ కచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్ పొలిట్ బ్యూరోలో సంస్కరణ తేవాలంటేనే కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి 3నెలల సమయం పడుతోందనే హింట్ ఇచ్చారు.
మహానాడులో శాసనాలను రూపొందించిన లోకేష్
ఆ క్రమంలో మరో మూడు నెలల్లో లోకేష్కు ప్రమోషన్ దక్కబోతుందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందంట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగింది. వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్యభూమిక పోషించారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న లోకేష్.. మిగిలిన విషయాలపై స్పందించనప్పటికి.. తర్వలో ఆయన ప్రమోషన్ గ్యారెంటీ అని పార్టీ సీనియర్లు అంటున్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.