Chandrababu Comments on YSRCP in Gannavaram Prajagalam Sabha: నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు ప్రజలు ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పొరపాటున వైసీపీ రెండో సారి అధికారంలోకి వస్తే ఎవరి భూమి వారిది కాదని.. ఆ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు ఆరోపించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించన ప్రజాగళం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలో పెద్ద సైకో ఉంటే.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వస్తే రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు. అవినీతి డబ్బును జగన్ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దగ్గర అవినీతి డబ్బు ఉంటే.. కూటమి దగ్గర నీతి, నిజాయితీ ఉన్నాయన్నారు.
గన్నవరంలో మరోసారి టీడీపీ గెలుపు తథ్యం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీకి కంచుకోట అని.. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్ తో సహా ఇప్పటి వరకు 8 సార్లు టీడీపీ విజయం సాధించిందని తెలిపారు. అమెరికాలో పనిచేసిన యార్లగడ్డ వెంకట్రావు.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. గన్నవరంలో ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Also Read: CM Jagan: పిఠాపురంపై చివర అస్త్రాన్ని సంధించిన జగన్..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్.. ప్రజల ఆస్తులను కొట్టేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు ప్రజలకు మాటిచ్చారు. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే ఎవరి భూమి వారికి దక్కదని ఆరోపించారు.
ఎవరి భూమి వారు అమ్ముకోవాలన్నాసరే.. దానికి జగన్ నుంచి తప్పనిసరిగా అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ కు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులకు భద్రత కావాలంటే ఎన్నికల్లో కూటమికి ఓటువేసి గెలిపించాలన్నారు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికీ గొడ్డలి వస్తుందన్నారు.
Also Read: వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..? : సజ్జల రామకృష్ణారెడ్డి
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రభుత్వం ఉద్యోగులను ఎంతగానో వేధించిందని.. అందుకే ఉద్యోగుల్లో నూటికి 90 శాతం మంది కూటమికి ఓటేశారని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే.. ప్రజల మెడలకు ఉరితాడు చుట్టుకుంటుందని చంద్రబాబు అన్నారు. అయితే గన్నవరంలో ప్రజాగళం బహిరంగ సభ జరగుతున్నప్పుడు మధ్యలో వర్షం పడినా సరే చంద్రబాబు లెక్కచేయకుండా.. వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.