Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
విమర్శలపై క్విక్ కౌంటర్లు.. మంత్రులకు ఆదేశం
రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రుల నుంచి సరైన రీతిలో స్పందన రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శలు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు బలంగా కౌంటర్లు ఇవ్వాలని, సమాధానం చెప్పడంలో ఆలస్యం చేయకూడదని మంత్రులకు సూచించారు. మెగా డీఎస్సీ అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టి వివాదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ఇటువంటి కుట్రల పట్ల మంత్రులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రో-యాక్టివ్గా సమాధానమివ్వాలని ఆదేశించారు.
నేతన్న భరోసా, వాతావరణ సవాళ్లు
సమావేశంలో నేతన్న భరోసా పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, నిజమైన అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని, ప్రతి చేనేత కార్మికుడికి మేలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ‘ఎల్ నినో’ ప్రభావం, దానివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులతో చర్చించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లు
జిల్లాల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇన్ఛార్జ్ మంత్రులు తక్షణమే చొరవ చూపాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బాధ్యత తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రధాని అక్కడ సుమారు రెండు గంటల పాటు గడపనున్నారని, అందులో 22 నిమిషాలు ఎయిర్పోర్టు సందర్శన, 20 నిమిషాల రోడ్ షో, మిగిలిన సమయం భారీ బహిరంగ సభకు కేటాయించారని తెలిపారు.
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ..
ఈ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఆగస్టు 1 కంటే ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రధాని కార్యక్రమంలో నిమగ్నం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా 10 వేల మందితో ‘ధింసా’ నృత్య ప్రదర్శనతో పాటు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్నీన్ సిగ్నల్!