CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేశామన్నారు. సింగపూర్ లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు.
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం
టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు సీఎం. అలాగే దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని.. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందన్నారు సీఎం. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందటంతో పాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో సీఎం భేటీ
సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, నూతన పారిశ్రామిక విధానాలను తెలిపారు. డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఉన్న అపారమైన అవకాశాలను సింగపూర్ అధ్యక్షుడికి వివరించారు.అయితే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని అందించేందుకు సింగపూర్ దేశాధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు.
జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్ను సందర్శించిన సీఎం
ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్ను సీఎం చంద్రబాబుతోపాటు మంత్రుల బృందం సందర్శించింది. ఈ సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రో కెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం అందిస్తున్న సేవలను సింగపూర్ ఉన్నతాధికారులు సీఎం బృందానికి వివరించారు. మొత్తం 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పెట్రో కెమికల్ హబ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్తో పాటు సమీకృత భద్రతా వ్యవస్థలనూ ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్తోపాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను చూపించారు. పెట్రో కెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ను వారికి వివరించారు.
Also Read: తోపుదుర్తి VS మాధవ్.. మధ్యలో పెద్దారెడ్డి
అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు నాలుగో రోజు సింగపూర్ పర్యటన
కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయిన సీఎం చంద్రబాబు
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్… pic.twitter.com/XVdTdGeXRL
— BIG TV Breaking News (@bigtvtelugu) July 30, 2025