CM Chandrababu: జనాభా నియంత్రణ కాదు- నిర్వహణ చేయాలి. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. మాట్లాడిన బాబు.. జనాభా పెరుగుదలపై పలు సూచనలు చేశారు. ఈ ప్రపంచం భవిష్యత్ లోనూ బాగుండాలంటే భావితరాలు బాగుండాలని సూచించారు. చంద్రబాబు పిలుపునివ్వడం సరే. ఐక్యరాజ్య సమితి లెక్కలేం చెబుతున్నాయి? వచ్చే రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎందుకంత అవసరం? ఆ విరాలు ఎలాంటివి?
అసలు సిసలైన ఆస్తి జనాభా- చంద్రబాబు
భారతీయుల దృక్పథం మారాలన్న పిలుపుఅందరూ జనాభా అంటే భారం అనుకుంటారు. ఇద్దరికి మించి పిల్లల్ని కనడం నేరమని భావిస్తారు. పిల్లలు ఎక్కువ అయితే ఖర్చు తడిసి మోపెడుగా లెక్కిస్తారు. కానే కాదు. వచ్చే రోజుల్లో డబ్బు- బంగారం- స్థలం పొలం- ఇల్లూ- వాకిలి ఆస్తి కానే కాదు. అసలు సిసలైన ఆస్తి జనాభా. ఇదీ చంద్రబాబు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడమరచి చెప్పిన జీవిత సత్యం.
మనది పాపులేటెడ్ ఇండియాగా వర్ణన
మీరు గానీ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ- హిందీ.. భాష ఏదైనా కావచ్చు.. మీ గొంతు దానిలోని స్వరం.. దాని వెనక భావం గుర్తించిన వెంటనే యాభై మంది భారతీయులు మీ చుట్టూ పోగవుతారు. దటీజ్ ఇండియా. పాపులర్ ఇండియా. పాపులేటెడ్ ఇండియా అంటారు చంద్రబాబు.
యువశక్తి క్షీణిస్తే ఆర్ధిక శక్తీ సన్నగిల్లుతుంది
ఎప్పుడైతే యువశక్తి క్షిణించి పోతుందో.. అప్పుడు మన ఆర్ధిక శక్తి కూడా సన్నగిల్లిపోతుంది. ఈ విషయం మీకు స్పష్టంగా అర్ధమైతే.. మిగిలినదంతా ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. మన పిల్లల్ని వద్దనుకోవడంలో అర్దమేంటంటే మన భవిష్యత్తును మనమే పణంగా పెట్టడం. అదే ఒక ఉమ్మడి కుటుంబం మీ వెంట ఉంటే మీరెంతటి బలవంతులో మీకు తెలీదు. మొదట అంగబలం అన్నారు. ఆ తర్వాతే అర్ధబలం. అంగబలం ఉంటే ఆటోమేటిగ్గా అర్ధబలం దానంతటదే మీ వెంట పడుడుందని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు.
1985 జులై 11న తొలిగా ప్రపంచ జనాభా నియంత్రణ దినం నిర్వహణ
ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని అంటారు చంద్రబాబు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న నినాదమిచ్చిన గురజాడబాటలో ముందుకెళ్లాలని అన్నారు సీఎం చంద్రబాబు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాల్సిన అవసరముందని అన్నారాయన. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలను మార్చుకోకుంటే సమస్యలు వస్తాయని.. అన్నారు చంద్రబాబు. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా 1985 జులై 11న మొదటిసారి ఐక్యరాజ్య సమితి.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించిందని చెప్పారు.
ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటేనే మంచిది
గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్లు. అదే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు చంద్రబాబు. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయన్నారు. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో.. ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది.. ఇది మెరుగుపడాలని సూచించారు సిఎం చంద్రబాబు. అందుకే తన నినాదం.. జనాభా నియంత్రణ కాదు- నిర్వహణగా పిలుపునిచ్చారాయన.
భారతీయుల దృక్పథం మారాలన్న పిలుపు
ఇది కేవలం ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మాత్రమే కాదు. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే సూచిస్తోంది. 2025లో భారత జనాభా 1.46 బిలియన్లకు చేరుకుంటుంది, సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని రిపోర్ట్ చేసింది యూఎన్. ఇప్పటి వరకూ సంతానోత్పత్తి కట్టడి గురించి ఆలోచించిన వారు.. ఇకపై పునరుత్పత్తి పెరుగుదలపై దృష్టి సారించాలని.. జాభా పెరుగుదలపై భారతీయుల దృక్పథం మారాలని పిలుపునిచ్చింది.