Tirumala Tour: భారతదేశంలో అత్యంత పవిత్రమైన దైవక్షేత్రాల్లో తిరుమల ఒకటి. ప్రతిరోజూ వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అనంత విశ్వాసంతో వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అయితే, అలాంటి పవిత్ర యాత్రలో చాలామంది భక్తులు ఓ అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన స్థలాన్ని మిస్సవుతుంటారు. ఆ పవిత్ర స్థలం ఏంటి? ఎందుకు భక్తులు మిస్ అవుతున్నారో తెలుసుకుందాం.
తిరుమల చుట్టూ పవిత్ర క్షేత్రాలే..
మనం తిరుమల పర్యటనకు వెళ్దామంటే చాలు ఒక్కరోజులో పర్యటన పూర్తి కాదు. శ్రీవారి దర్శనం ఒక్కటే కాక చుట్టూ పవిత్ర ప్రదేశాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంటే చాలు, మనం అక్కడి ఏ పవిత్ర స్థలాన్ని మిస్ కాలేము. అయితే తిరుమలకు వచ్చే అధికంగా మిస్ అయ్యే పవిత్ర ప్రదేశం ఒకటి ఉంది. అదే పాపవినాశనం.
పాపవినాశనం.. పేరులోనే పవిత్రత
తిరుమల కొండల మధ్యలో, శ్రీ వేంకటేశ్వరుడి ఆధ్యాత్మిక పరిసరాల్లో వెలసిన ఈ జలపాతం పేరు పాపవినాశనం. ఇది ఒక ప్రకృతి సిద్ధమైన జలపాతం. ఇక్కడ స్నానం చేస్తే పూర్వ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీ హరిదేవుడు తన శుద్ధమైన తేజస్సును ప్రసరించి ఈ జలాన్ని పవిత్రం చేశారని చెబుతారు.
అసలు ఎలా చేరుకోవాలి?
తిరుమల ప్రధాన దేవస్థానం నుండి సుమారు 5.5 కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం ఉంది. టీటీడీ ఆధ్వర్యంలో రోజూ ప్రత్యేక బస్సులు ఇక్కడికి అందుబాటులో ఉంటాయి.
అంతేకాదు, ప్రైవేట్ వాహనాలకు కూడా ప్రవేశం ఉంది. బస్సు ప్రయాణం ద్వారా కొండల అందాలు తిలకిస్తూ వెళ్లొచ్చు.
పాపవినాశనంలో ప్రత్యేకతలు తెలుసుకుంటే..
ఇక్కడి జలపాతం శాంతియుతంగా ఉండే జలపాతం. ఇక్కడ స్నానం ఆచరిస్తే భక్తులకు శరీర శుద్ధి ఒక్కటే కాదు, మనోశాంతికి కూడా మార్గమని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ పవిత్ర స్థలాన్ని దర్శించాలి. కొండల మధ్య, వృక్షవాటికల మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సంతరించుకొని ఉంది. తిరుమల దర్శనం అనంతరం కొన్ని గంటల కోసం పాపవినాశనంలో గడిపితే, దైవభక్తికి విశ్రాంతి కూడా కలుగుతుందని చెప్పవచ్చు. పాపవినాశనం ప్రాంగణంలో చిన్న ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడి పాదాలు ప్రతిష్ఠించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో చిన్న పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తారు. ఇది భక్తులకు తెలియని మరో విశేషం.
అధిక సంఖ్యలో భక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు?
శ్రీవారి ఆలయ దర్శనానంతరం ఆత్మసంతృప్తితో వెంటనే తిరుగు ప్రయాణం కావడం ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే పాపవినాశనం గురించి సమాచారం లేని పరిస్థితిని కొందరు భక్తులు ఎదుర్కుంటారు. టూరిజం ప్యాకేజీలలో ఈ ప్రదేశం ప్రాధాన్యతగా చేర్చకపోవడంతో భక్తులు అధికంగా మిస్ అవుతున్నారని చెప్పవచ్చు.
Also Read: Fine Rice Distribution: జూన్ 12నుంచి బియ్యం మారుతోంది..! చంద్రబాబు సర్కార్ సన్నబియ్యం సంచలనం
ఇక్కడ టిటిడి సౌకర్యాలు ఇవే
పాపవినాశనం వద్ద బస్టాండ్, తలస్నాన ఘట్టాలు, చిన్న టాయిలెట్, డ్రెస్సింగ్ గదులు, భక్తుల సౌకర్యానికి సెక్యూరిటీ సిబ్బంది ఇతర సౌకర్యాలను టీటీడీ కల్పించింది. తిరుమల యాత్రను సంపూర్ణంగా అనుభవించాలంటే, పాపవినాశనాన్ని సందర్శించకుండా ఉండకూడదు. ఇది కేవలం ఒక జలపాతం కాదు, ఆధ్యాత్మిక శుద్ధి కేంద్రం. స్వామివారి దర్శనం అనంతరం ఈ ప్రదేశాన్ని చూడటం వల్ల మన మనస్సును పవిత్రతతో నింపుకోవచ్చు. అందుకే తిరుమలకు వెళుతున్నారా.. తప్పక పాపాలను వినాశనం చేసే పవిత్ర ప్రదేశం పాపవినాశనం మరచిపోవద్దు సుమా!