Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. హైకోర్టు తీర్పును సాకుగా చూపి.. పేద ఆడబిడ్డలకు అందుతున్న సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆపేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆగస్టు 12న ఈ రెండు పథకాలపై కోర్టు స్టే విధించింది. వీటి కోసం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
సెప్టెంబర్ 9కి వాయిదా..
తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. కోర్టు కౌంటర్ దాఖలు చేయమని నాలుగుసార్లు గడువు ఇచ్చినా.. ప్రభుత్వం ఎందుకు దాఖలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా కేసుల్లో, మంత్రులపై అవినీతి కేసుల్లో కోట్లు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకునే ప్రభుత్వం.. ఆడబిడ్డల హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ హయాంలో 13 లక్షల మంది లబ్ధిదారులకు.. 13 వేల కోట్ల రూపాయల సాయం అందిందని చెబుతున్నారు.
కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్..
మొదట 51 వేలతో మొదలైన కళ్యాణలక్ష్మి సాయం.. తర్వాత లక్షకు పెరిగింది. ఎన్నికల్లో కళ్యాణలక్ష్మికి తోడు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఉన్న పథకాన్నే ఎత్తేయాలని చూస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా?
కళ్యాణలక్ష్మి పథకం అమలు ఇప్పుడు.. వచ్చే సెప్టెంబర్ 9 నాటి కోర్టు విచారణపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా? పెండింగ్ చెక్కులు విడుదలవుతాయా? అని ఆడబిడ్డల తల్లిదండ్రుల ఎదురుచూస్తున్నారు.
Also Read: సిరిసిల్లలో ఘోర అగ్నిప్రమాదం.. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ దగ్ధం.. యూపీ కూలీ సజీవ దహనం!