AP Politics: దేనికైనా టైమ్ రావాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ పునాదులు కదులుతున్నాయి. ముసలికి నీళ్లలో బలం ఉన్నట్టు.. పుంగనూరు అడ్డాగా దశాబ్దాలుగా పెద్దిరెడ్డిదే పెత్తనం కొనసాగింది. మైనింగ్ నుంచి లిక్కర్ వరకు.. ఆయనదే హవా. ఆయన చెప్పిందే శాసనం. కను సైగలతో పుంగనూరు నియోజకవర్గాన్ని, ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఏలారు పెద్దిరెడ్డి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పతనం కావడంతో.. పెద్దిరెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెడ్ బుక్ పేర్లను బయటకు తీస్తుండటంతో.. పెద్దిరెడ్డితో పాటు ఇన్నాళ్లూ ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన కొందరు ఖాకీల కూసాలు సైతం కదులుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మర్డర్.. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్నే షేక్ చేసింది. ఇన్నాళ్లూ పొలిటికల్ పెద్దలకు ఊడిగం చేసిన పోలీసుల స్థానాలు మారాయి. పనిలో పనిగా.. చిత్తూరు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తోంది పోలీస్ శాఖ.
ఒకరు, ఇద్దరూ కాదు. ఏకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 264 మంది పోలీసులను రాత్రికి రాత్రే బదిలీ చేసింది ప్రభుత్వం. కౌన్సిలింగ్ గట్రా లేకుండా.. ఒక్క ఆర్డర్తో అందరినీ ఆర్డర్ లో పెట్టింది. జిల్లాలోని ప్రతీ పీఎస్లోనూ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఏకంగా 20 మందిపై వేటు పడింది. పుంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా 60 మంది ఖాకీలు బదిలీ అయ్యారు. తీవ్ర ఆరోపణలు ఉండి, పెద్దిరెడ్డి మనుషులుగా ముద్ర ఉన్న సిబ్బందిని సుదూర ప్రాంతాలకు పంపించారు. కొందరిని కుప్పం, రాళ్ల బూదుగూరుల PSలకు బదిలీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్లో పని చేస్తున్న వారికి, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న పలువురికి.. పుంగనూరులో పోస్టింగ్ ఇచ్చారు.
ఇంతటి సంచలన నిర్ణయానికి కారణం ఇటీవల చిత్తూరులో జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్య. ఈ మర్డర్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇంకా వెయిట్ అండ్ సీ విధానం సరికాదని.. బదిలీ కొరడా ఝలిపించింది. ఏకకాలంలో.. ఏకంగా 264 మంది పోలీసులను బదిలీ చేయడం మాత్రం మామూలు విషయం కానే కాదు. శాంతిభద్రతల మేటర్ లో సర్కారు ఎంత సీరియస్ గా ఉందో చెప్పకనే చెప్పింది.
Also Read: జగన్కు దారేది? ఏమి సేతురా ప్రభువా!!
చిత్తూరు జిల్లాలో పోలీసుల పని తీరుపై ప్రభుత్వం కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. శాంతిభద్రతల విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టనట్టు ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే.. ఈ సంచలన నిర్ణయం అంటున్నారు. కానిస్టేబుల్ లతో పాటు సీఐ, ఎస్సై స్థాయి అధికారులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పని చేసిన నర్సింహులు అనే ఎస్సై తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆనాటి పెద్దల అండ చూసుకుని రెచ్చిపోయాడని అంటారు. ఓ ఎన్నారైని అక్రమ అరెస్ట్ చేసి.. అతను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నాడని.. అతని నుంచి 3 లక్షలు బలవంతంగా వసూల్ చేశారనే ఆరోపణ ఉంది. ఓ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకుని.. ఆ భార్యతో పుస్తెలతాడు అమ్మించి మరీ డబ్బులు లాగేసుకున్నాడని అంటారు. ప్రభుత్వం మారాక ఆ అరాచక ఎస్సై నర్సింహులుపై సస్పెన్షన్ వేటు పడింది. లేటెస్ట్ గా.. 264 మంది పోలీసుల బదిలీలతో.. పుంగనూరుతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ను ఆర్డర్ లో పెట్టే పని ప్రారంభించింది. ఈ బదిలీల వేటుతో పరోక్షంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనానికి చెక్ పెట్టినట్టేనని అంటున్నారు. రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎట్టా ఉంటాదో ఇప్పటికైనా పెద్దిరెడ్డికి తెలిసొచ్చుంటుందిగా? పోలీసులు సరే.. మరి నెక్ట్స్ టార్గెట్ పెద్దాయనేనా?