![TDP-Janasena news TDP-Janasena news](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/cf62eec428d1d35f4764af371be7f23b.jpg)
TDP-Janasena news(Andhra pradesh political news today):
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఇప్పటికే కుదిరిపోయింది. ఇక సీట్లు లెక్క మాత్రమే తేలాల్సి ఉంది. మరోవైపు ఇరుపార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో భారీగా బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. ఇందుకు వేదికను ఖారారు చేశాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాత్రయాత్ర విజయోత్సవ సభను నిర్వహించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ అంశమే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.
టీడీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ రానుండటం ఇదే తొలిసారి. రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల కార్యకర్తలు ఈ సభకు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు.
యువగళం విజయోత్సవ సభను నిర్వహించేందుకు టీడీపీ 14 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.
యువగళం విజయోత్సవ సభకు బస్సులు కేటాయించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. అన్ని డిపోల నుంచి అద్దెకు బస్సులు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.