Adireddy Vasu: మంత్రి నారా లోకేష్కి ప్రమోషన్ రాబోతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తన వారసుడికి కీలక బాధ్యతలు కట్టబెట్టబోతున్నారా?.. అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు కూటమి ప్రభుత్వంలో దానిపై చర్చలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ఉహాగానాలతో లోకేష్ ప్రమోషన్పై మళ్లీ ప్రచారం మొదలైంది. తాజాగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. పార్టీలో మూడో తరం నేతగా ఫోకస్ అవుతున్న లోకేష్కు డిప్యూటీ సీఎంగా అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు.
మొదట్లో ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి పదవి దక్కించుకున్న నారా లోకేష్.. వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.. రోజా లాంటి వారైతే ఆయనసలు రాజకీయాలకే పనికి రారని.. ముద్ద పప్పని ఎద్దేవా చేశారు. 2019లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఢక్కామొక్కీలు తిన్న లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారు. అన్ని రకాలుగా పరిపక్వత సాధించి తాను ఓడిపోయిన మంగళగిరిలోనే అఖండ మెజార్టీతో గెలిచి, తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత ప్లేస్లో లోకేష్ ఉన్నారు. ఆయనను భవిష్యత్తు నేతగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల తర్వాత పార్టీలో మూడో తరం నాయకుడిగా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు లోకేష్ సామర్ధాన్ని శంకించిన పార్టీ సీనియర్లు, కేడర్ ఇప్పుడాయనపై పూర్తి నమ్మకంతో కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు.
కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి ఇదే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిక్వెస్ట్ చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయమని ఆయన కోరడంతో తెలుగు తమ్ముళ్లంతా హర్షాతిరేకాలతో మద్దతు పలికారు.
Also Read: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ
మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై TDP సీనియర్, జూనియర్ నాయకులనే తేడా లేకుండా ఒక్కరొక్కరిగా మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానని స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారని.. వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.