CM Chandrababu Naidu: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం అన్నారు. పరమసముద్రంలో బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. నదుల అనుసంధానం జరిగితే అసలు కరువు అనేదే ఉండదని చెప్పారు. తెలంగాణ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. నీరు లేనప్పుడే దాని విలువ తెలుస్తుందని చెప్పారు. నీటిని సమర్థవంతంగా వాడుకోవడంతో 80 శాతం రిజర్వాయర్లు నిండుతున్నాయని సీఎం చెప్పారు.
మంచి పనులు చేస్తుంటే కొందరు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘నీటి పరవళ్లు చూసి రాష్ట్ర ప్రజల ఆనందంలో భాగస్వామ్యం అయ్యాను. రెండేళ్ల కంటే ముందే కుప్పానికి కృష్ణా జలాలు వచ్చాయి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమగా ఉండేది.. ఇప్పుడు రాళ్ల సీమగా మారింది. సినిమా సెట్టింగ్ వేసి నీళ్లు ఇచ్చి.. మోసం చేసిన ఘనత వైసీపీదే’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
‘కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోంది. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైంది. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చాం. ఏడు వందల మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారింది. అందుకే శతాబ్దాలు గడిచినా… కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదు’ అని చెప్పుకచ్చారు.
ALSO READ: BRS vs Congress: బీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ బాయ్కాట్.. మంత్రి తుమ్మల ఫైర్..
‘అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా. 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చాం. గంగమ్మ ఆశీర్వదించింది… కుప్పానికి కృష్ణమ్మ వచ్చింది. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూర్టీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించాను. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను… రతనాల సీమ చేస్తాను’ అని తెలిపారు.
ALSO READ: CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి
2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. గతం ఓసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయింది. అబద్దాల చెప్పడంలో వైసీపీ దిట్ట. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎన్టీఏ వల్లే సాధ్యం. ఇప్పుడు కుప్పానికి నీళ్లు రాగానే జీర్ణించుకోలేకపోతున్నారు. బయట నుంచి నీళ్లు తెచ్చి మభ్యపెట్టడం వైసీపీకి అలవాటు. చెరువులను నీళ్లతో నింపడం మాకు అలవాటు’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.