Kumaraswamy Vizag accident | కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఈ కేంద్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు వెళ్తుండగా, ప్రయాణిస్తున్న కాన్వాయ్లో అనుకోని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం షీలానగర్లో మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్లో మొత్తం ఎనిమిది వాహనాలుండగా.. మూడు కార్లు ఒకదానితో మరొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నారాయణ రావు కారు ధ్వంసమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే సిబ్బంది జీవీఎల్ కారును పక్కకు తీయగా.. మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రయాణం కొనసాగించారు. ఘటన తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం
ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్కు వచ్చిన కేంద్ర మంత్రులను ఏపీలోని అధికార కూటమి నేతలు ఘనంగా స్వాగతించారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు బయల్దేరిన మంత్రుల కారు కాన్వాయ్లో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై స్పీడ్గా వెళ్తున్న క్రమంలో ఒక కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా.. వెనుకున్న కారు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో స్థానికంగా కొంత అలజడి రేగింది. అయితే, కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో బీజేపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ. 11,440 కోట్లు
ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్లు ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. అయితే, ప్లాంట్ ప్రైవేటీకరణపై జరిగిన ప్రచారం వల్ల కార్మికులు, ఉద్యోగులలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు పంపించింది. వారు ప్లాంట్ కార్మికులతో చర్చలు జరిపి, అపోహలను తొలగించే బాధ్యత వహించారు. ఈ చర్చల ద్వారా కార్మికులు, ఉద్యోగులలోని అపోహలను తొలగించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రైవేటీకరణ చేపట్టడం లేదని కేంద్రం ఇప్పటికే తెలిపింది.
ప్లాంట్కు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నట్లు మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్కు ఉన్న బకాయిలు రూ. 35 వేల కోట్లను ఒకేసారి ప్రకటిస్తేనే సమస్యకు పరిష్కారం వస్తుందనే ఆలోచన సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రయత్నంగా రూ. 11,440 కోట్ల ప్యాకేజీని అందించింది. ఈ నిధుల సహాయంతో ఆగస్టు నెలలోగా రెండు లేదా మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తిస్థాయిలో వినియోగించుకొని, 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే, నష్టాలను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సెయిల్లో విలీనం అంశం
సెయిల్ (SAIL)లో విలీనం అంశాన్ని ప్రస్తావిస్తూ, సెయిల్ పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది పబ్లిక్ రంగ సంస్థ అని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీని అందించిన తర్వాత, ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, విలీనం చేసుకుంటామని సెయిల్ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. సెయిల్లో విలీనం అంశాన్ని స్టీల్ ప్లాంట్, కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కేంద్రం మరోసారి సహాయం చేస్తుంది
ప్యాకేజీ ఆధారంగా ప్లాంట్ను పునరుద్ధరించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరోసారి సహాయం చేస్తుందని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్లాంట్ను సమర్థవంతంగా నిర్వహించి, దాని ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు కేంద్రం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన నొక్కి చెప్పారు.