YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ వేదికగా కేంద్ర అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మోదీ వ్యాఖ్యలపై ఘాటు స్పందన
రాజకీయ శాస్త్రంలో ప్రధాని మోదీ నిజంగా ఒక ‘మాస్టర్ అబ్యూజర్’ అని షర్మిల అభివర్ణించారు. దేశానికి సాధించిన విజయాలు చెప్పడానికి ఏమీ లేకనే మోదీ ప్రతిపక్షాలపై పడుతున్నారని.. ఇది ఆయన భయానికి, అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శించారు. ఆయన మాటల్లో కనిపిస్తున్న అసహనం రాజకీయ నిరాశ నిస్సహాయతలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
బిజెపి భావజాలమే అసలైన ముప్పు
దిమాగి (అర్బన్) నక్సల్స్ వల్ల కాదని, బిజెపి – ఆర్ఎస్ఎస్ వ్యాపింపజేస్తున్న వేర్పాటువాదం, మతపిచ్చి వల్లనే దేశానికి అసలైన ముప్పు పొంచి ఉందని షర్మిల హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సింది, అప్రమత్తంగా విమర్శించాల్సింది ఈ భావజాలం నుంచేనని అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి, ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఇటువంటి పదాడంబరాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగంపై కుట్రలు, విభజన రాజకీయాలు
సువిశాల భారతంలో అశాంతిని రేకెత్తిస్తూ.. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య విభజన తెచ్చి ఘర్షణలకు ఆజ్యం పోసేది కేవలం బిజెపి మాత్రమేనని స్పష్టం చేశారు. బిజెపి – ఆర్ఎస్ఎస్ తీవ్రవాదాన్ని, వారి వినాశకర విధానాలను వ్యతిరేకించే ‘దిమాగి నక్సల్’గా తాను కూడా గర్వపడుతున్నానని షర్మిల వ్యాఖ్యానించారు.
Also Read: సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా