YCP MLC Janga met chandrababu(Andhra pradesh today news): ఏపీలో అధికార పార్టీ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో నేత కూటమిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు… పోతున్నారు కూడా. ఈ జాబితాలోకి ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరిపోయారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తో ఆయన భేటీ అయ్యారు.
పల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఆయన కొడుకు కోటయ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. అక్కడ ఉండలేనని, టీడీపీలో చేరేందుకు సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. జంగా వెంట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. రేపే మాపో గురజాలలో జరగనున్న ఎన్నికల శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
వైసీపీలో బీసీ నాయకులంటే ముందుగా గుర్తు కొచ్చే పేరు జంగా కృష్ణమూర్తి. సీఎం జగన్ ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ పార్టీలో ఆయన ఎంత కీలకమో దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే గురజాలలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్రెడ్డి తీరే ఆయన్ని పార్టీ మారేలా చేసింది. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కనీసం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానాలకు గురిచేశారన్నది జంగా మాట.
వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగారయన. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్నా తన మాటకు విలువ లేకుండా చేశారనే ఆగ్రహంతో రగిలిపోయారు. తనకు అవమానం జరిగిన పార్టీ ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి గురజాల వైసీపీకి టికెట్పై ఆయన చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ సీటును కేటాయించారు.
ALSO READ : అవనిగడ్డ సీటు ఆయనదే, ఎందుకంటే..?
ఈ క్రమంలో ఏ పార్టీ వైపు వెళ్తే బాగుందని ఆలోచన చేశారు. మహేష్రెడ్డికి చెక్ పెట్టాలంటే టీడీపీయే బెటరని ఓ అంచనాకు వచ్చారు. ముఖ్యమైన నేతలతో సమావేశమయ్యారు. చివరకు అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో భేటీ అయ్యారు. గురజాలలో టీడీపీ సభలో జంగా కృష్ణమూర్తి జాయిన్ కానున్నారు.