ఎయిర్ ఇండియా చేసిన పనికి వృద్ధ దంపతులు ఇబ్బంది పడిన ఘటనపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు సరైన సర్వీసులు అందించడంలో విఫలం అయ్యారంటూ మండిపడింది. ఎయిర్ ఇండియా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవృద్ధ దంపతులకు రూ.60 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్ వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ముందుగానే బుక్ చేసుకున్న సీట్లను ఎలాంటి సరైన కారణం లేకుండా మార్చడంతో వారికి తీవ్ర అసౌకర్యం కలిగిందని కమిషన్ నిర్ధారించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ కేసులో ఫిర్యాదు చేసిన అమర్ జిత్ సింగ్ రల్లా, ఆయన భార్య పరంజిత్ కౌర్ రల్లా పంజాబ్ కు చెందిన సీనియర్ సిటిజన్లు. వీరిద్దరూ తమ విదేశీ ప్రయాణానికి చాలా రోజుల ముందే ట్రావెల్ ఏజెంట్ ద్వారా విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ప్రయాణంలో కలిసి కూర్చునేందుకు 17A, 17B సీట్లను సెలెక్ట్ చేసుకున్నారు. విమానం ఎక్కే సమయంలో ఎయిర్ ఇండియా అధికారులు వారి సీట్లను మార్చి, తక్కువ లెగ్ స్పేస్ ఉన్న మరో సీటును కేటాయించారు. దీంతో ఇద్దరూ కలిసి కూర్చోలేకపోయారు. అంతేకాదు, అమర్ జిత్ సింగ్ కు ఇచ్చిన సీటులో కాళ్లు చాచుకునేంత స్థలం కూడా లేకపోవడంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అమర్ జిత్ సింగ్ కు గతంలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికీ దాదాపు 14 గంటల పాటు ఇరుకైన సీటులో ప్రయాణించాల్సి రావడంతో ఆయనకు వెన్నునొప్పి, కాళ్ల వాపు వంటి సమస్యలు వచ్చాయి. ప్రయాణం ముగిసిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు మంచానికే పరిమితమయ్యారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ కారణంగా తాము హాజరుకావాల్సిన ఫ్యామిలీ ఫంక్షన్ కు కూడా ఆయన వెళ్లలేకపోయారు. ఇక ఆయన భార్యను కూడా వేరే సీటులో కూర్చోబెట్టడంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడ్డారు. తమకు జరిగిన శారీరక, మానసిక ఇబ్బందులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
కమిషన్ ఈ కేసును విచారించి, ఎయిర్ ఇండియా సర్వీసులలో లోపం ఉందని నిర్ధారించింది. పరిహారం, వ్యాజ్య ఖర్చులతో కలిపి రూ.40 వేల చెల్లించాలని సంస్థను ఆదేశించింది. అయితే, ఆ మొత్తం సరిపోదని భావించిన వృద్ధ దంపతులు రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించారు. వారి అప్పీల్ను విచారించిన రాష్ట్ర కమిషన్ జిల్లా కమిషన్ నిర్ణయాన్ని సమీక్షించింది. వృద్ధ దంపతులు ఎదుర్కొన్న శారీరక ఇబ్బందులు, మానసిక వేదన, వైద్య సమస్యలు, కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రూ.40 వేల పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. ఎయిర్ ఇండియా ముందుగా కేటాయించిన సీట్లను మార్చడం ద్వారా సర్వీసులలో నిర్లక్ష్యం వహించినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కమిషన్ ఇచ్చిన పరిహారాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు పెంచింది. మానసిక వేదన, శారీరక ఇబ్బందులు, సేవల్లో లోపం కారణంగా మొత్తం రూ.60 వేల నష్టపరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు రాష్ట్ర కమిషన్ తుది ఆదేశాలు జారీ చేసింది.
Read Also: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక చౌకగా విదేశీ ప్రయాణం!