అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు తగ్గడంతో, కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో వసూలు చేస్తున్న ఫ్యూయల్ సర్ ఛార్జ్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత మేర ప్రయాణ ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
పలు అంతర్జాతీయ రూట్లలో సర్ ఛార్జ్ తగ్గింపు
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో ఇంధన సర్ ఛార్జ్ ను 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. యూరప్కు వెళ్లే విమానాలపై ఈ రుసుమును 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించింది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్ ధరలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల ఇంధన వ్యయం కొంత తగ్గింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంధన ధరలు తగ్గినప్పటికీ అవి గతంతో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అటు ఇతర ఎయిర్ లైన్స్ సర్ ఛార్జ్ ను పూర్తిగా తొలగించే విషయంలో తొందరపడటం లేదు. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తూ, ధరలు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగుతాయా లేదా అనే అంశాన్ని గమనిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగిసే సమయానికి లేదంటే థర్డ్ క్వార్టర్ ప్రారంభంలో మరికొన్ని విమానయాన సంస్థలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సర్ ఛార్జ్ ను పూర్తిగా రద్దు చేయాలా? లేదా దశలవారీగా తగ్గించాలా? అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.
విమానయాన సంస్థలు ప్రయాణికులకు తక్కువ ధరల్లో సేవలు అందించాలని భావిస్తున్నప్పటికీ, మరోవైపు తమ లాభాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంధన ధరల్లో వచ్చిన తగ్గుదల అలాగే ఉంటుందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాలతో పోలిస్తే దేశీయ విమానాల్లో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో ముందుగా దేశీయ మార్గాల్లోనే ఇంధన సర్ ఛార్జ్ ను తగ్గిండం లేదంటే పూర్తిగా తొలగించే అవకాశం ఉందని విమానయాన వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ముడి చమురు, ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం కూడా పెరిగింది. ఈ భారం నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ లాంటి సంస్థలు ఈ ఏడాది మార్చిలో ఇంధన సర్ ఛార్జ్ ను అమల్లోకి తీసుకొచ్చాయి. బేస్ టికెట్ ధరలను ఒక్కసారిగా పెంచకుండా, అదనపు ఇంధన వ్యయాన్ని ప్రయాణికులతో పంచుకునే ఉద్దేశంతో ఈ రుసుమును వసూలు చేశాయి. ప్రస్తుతం ఇంధన ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ ప్రయాణికులకు కొంత ఊరటనివ్వనుంది.
Read Also: ఒక్క టికెట్ తో అయోధ్య, కాశీ, పూరీ దర్శనం.. IRCTC బంపర్ ఆఫర్!