Ferrari Luce EV Auction: ఫెరారీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు లూస్ ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఈ కారు మొదటి ప్రొడక్షన్ యూనిట్ ‘ఛాసిస్ 0’ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైంది. మాంటెరీ కార్ వీక్ సందర్భంగా జరిగిన ఆర్ఎం సోథెబీస్ మాంటెరీ వేలంలో ఈ కారు అరుదైన ఘనత సాధించింది.
ఫెరారీ లూస్ ‘ఛాసిస్ 0’ ఏకంగా 40 మిలియన్ డాలర్లకు, అంటే సుమారు రూ.382 కోట్లకు అమ్ముడైంది. దీంతో వేలంలో ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన కొత్త కారుగా రికార్డు సృష్టించింది. సాధారణంగా ఈ కారుకు 1.1 మిలియన్ నుంచి 1.6 మిలియన్ డాలర్ల వరకు ధర రావచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే, వేలం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారు కోసం పలువురు భారీ మొత్తాల్లో బిడ్లు వేయడంతో ధర అనూహ్యంగా పెరిగింది. చివరికి అంచనా ధర కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువ మొత్తానికి ఈ కారు అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫెరారీ లాంటి స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ నుంచి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం రావడంపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫెరారీ అభిమానుల్లో కొందరు బ్యాటరీతో నడిచే కారు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, వేలంలో వచ్చిన స్పందన ఆ అనుమానాలను పక్కన పెట్టింది. భారీ ధరకు కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావడంతో లూస్ కు మార్కెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటనేది మరోసారి తేలింది. ఫెరారీ బ్రాండ్కు అరుదైన ఘనత దక్కింది.
ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఫెరారీ తీసుకోదు. సుమారు రూ.382 కోట్ల ఆదాయాన్ని ‘ది ఫెరారీ ఫౌండేషన్’ ద్వారా ఎడ్యుకేషన్ కార్యక్రమాలకు ఉపయోగించేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనుంది. ఈ కారు అమ్మకం కేవలం రికార్డు ధరకు కారు అమ్మడమే కాకుండా, సామాజిక కార్యక్రమానికి కూడా ఉపయోగపడనుంది. ఫెరారీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి పేరును మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే, యజమానికి ఫెరారీ లూస్ ‘ఛాసిస్ 0’ను 2027 ప్రారంభంలో అందించనున్నారు. తొలి ఎలక్ట్రిక్ ఫెరారీకి సంబంధించిన ఈ ప్రత్యేక కారు ఇకపై సాధారణ లగ్జరీ వాహనం మాత్రమే కాదు. ఫెరారీ చరిత్రలో ఎలక్ట్రిక్ యుగానికి గుర్తుగా నిలిచే ప్రత్యేక మోడల్ గా నిలిచిపోనుంది.
Read Also: పిల్లల కోసం మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్.. బుల్లి ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా!