BRS Protest: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్లో భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ ఎంఆర్ఓ కార్యాలయం గేటు నుంచి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను నీరుగార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేయడమే రేవంత్రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.“ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం.. వద్దురా కాంగ్రెస్ పాలన.. రేవంత్రెడ్డి డౌన్ డౌన్.. చెత్త పాలనకు చరమగీతం పాడాలి” అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
Alsop Read: ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?
పేదల కన్నీళ్లతో ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని,పేదల సంక్షేమాన్ని అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెబుతామని భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. పేదింటి ఆడబిడ్డల ఉసురు తగిలి రేవంత్రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు డిప్యూటీ తాసిల్దార్ అనూష రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీదేవి,కౌన్సిలర్ల నిశిత రెడ్డి, రజిత, సురేష్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు దయానంద్ యాదవ్,కోల వెంకటేష్, మామిడ్ల వెంకటేష్,సందీప్ గౌడ్,నవీన్ రెడ్డి,విష్ణు చారి, కరుణాకర్ రెడ్డి,రాజు, శంకర్, శైలేందర్,గణేష్, నాగరాజు , విఠల్, జగన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రణదీప్ రెడ్డి, రాజమల్లారెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లు,తక్కువ ధర.. ఊరమాస్ డిస్ప్లేతో స్మార్ట్వాచ్!