Luxury Car Theft Gang Busted: లగ్జరీ కార్లే టార్గెట్ గా దేశ వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో లగ్జరీ కార్ల చోరీకి పాల్పడుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అధునాతన పరికరాలను ఉపయోగించి డూప్లికేట్ కీలను తయారు చేసి ఖరీదైన కార్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను రాజస్థాన్లోని బార్మర్, బలోత్రా ప్రాంతాల్లో తమ పరిచయస్తులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఒక మహిళ సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ను స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 27న సింగాసంద్రలోని ఓ హోటల్ పార్కింగ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ కనిపించకుండా పోయింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఈ వాహనాన్ని బెంగళూరుకు తీసుకొచ్చాడు. వీకెండ్ పర్యటనలో భాగంగా సిటీకి వచ్చిన అతడు రాత్రి సినిమా చూసి సుమారు 1.30 గంటల సమయంలో హోటల్కు తిరిగి వచ్చి కారును పార్క్ చేశాడు. అయితే, మరుసటి రోజు చూసేసరికి వెహికల్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.
కారు చోరీ కేసును విచారించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. దర్యాప్తులో భాగంగా జూలై 4న కరాడ్ సమీపంలోని బెళగావి-పుణే జాతీయ రహదారి దగ్గర అనుమానితులను గుర్తించారు. అయితే, ప్రధాన నిందితుడు చోరీ చేసిన కారుతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడితో ఉన్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమె కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఖరీదైన కార్లను టార్గెట్ చేస్తున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగించారు. చివరకు జూలై 17న సిల్క్ బోర్డ్ సమీపంలో ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది. విచారణలో అతడు అధునాతన పరికరాలను ఉపయోగించి లగ్జరీ వాహనాలకు సంబంధించిన డూప్లికేట్ కీలను తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. వాటి సాయంతో కార్లను అన్ లాక్ చేసి దొంగిలించిన తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేవాడని తెలిపారు.
దొంగిలించిన కార్లను రాజస్థాన్లోని బార్మర్, బలోత్రా, ఇతర ఎడారి ప్రాంతాల్లో ఉన్న పరిచయస్తులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడి సమాచారం ఆధారంగా రాజస్థాన్లోని ధోరిమానా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలేటి ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు. జూలై 24న అక్కడ దొంగిలించిన టయోటా ఫార్చ్యూనర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.35 లక్షలుగా పోలీసులు తెలిపారు.
అరెస్టయిన ప్రధాన నిందితుడిపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్, తమిళనాడు ప్రాంతాల్లో నమోదైన మొత్తం 21 కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లు ఎన్ని కార్లు దొంగతనం చేశారు? వాటిని ఎక్కడ అమ్మారు? ఈ నెట్ వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?