Temple Stampede: బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
అశోక్ ధామ్ ఆలయం దగ్గర.. ఉదయాన్నే భారీ రద్దీ నెలకొంది. దాదాపు 50 వేల మంది భక్తులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం పూట ఓ విద్యుత్ స్తంభం కూలిపోయింది. కరెంట్ షాక్ కొడుతోందన్న పుకారు క్షణాల్లో వ్యాపించింది. దీంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. బ్యారికేడ్లు కుప్పకూలాయి. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. క్షతగాత్రులను లఖిసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసినా.. ఊహించని విధంగా జనం పోటెత్తారని అధికారులు చెబుతున్నారు. 2019లోనూ ఇక్కడ ఇలాంటి ప్రమాదమే జరిగింది.
Also Read: మంత్రి పదవి దక్కకపోయినా తగ్గేదేలే.. ఎమ్మెల్సీ నాగబాబుకు దక్కిన బంపర్ ఆఫర్!
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలోని నాగచంద్రేశ్వర ఆలయం దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. నాగపంచమి కావడంతో ఏడాదికి ఒకసారి తెరిచే ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. బ్యారికేడ్లలో కరెంట్ ఉందన్న పుకారుతో తొక్కిసలాట చెలరేగింది. దాదాపు 13 మంది భక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ తొక్కిసలాటతో ఆలయ దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేశారు.
ఒకే రకమైన పుకారు.. రెండు రాష్ట్రాల్లో భక్తుల ప్రాణాలు తీసింది. లఖిసరాయ్ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఈ రెండు తొక్కిసలాట ఘటనలు చూశాక.. ఆలయాల దగ్గర రద్దీ నియంత్రణ మరోసారి ప్రశ్నార్థకమైంది.
Also Read: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. సెప్టెంబర్ 16 లోపు ఇది చేయకపోతే మీ ఓటు పోయినట్లే?