Cyberabad Traffic: స్వేచ్ఛ బ్యూరో: కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆఫీసు వేళల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ప్రధాన జంక్షన్లు, రోడ్డు కారిడార్లు, బాటిల్నెక్స్ను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల విభాగాధిపతులు నిర్ణయించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, యుటిలిటీల షిఫ్టింగ్, తాగునీరు, సీవరేజ్ మౌలిక వసతుల అభివృద్ధిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.
సమస్యలకు కారణాలను విశ్లేషించాలని సమావేశం..
సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో పాటు విద్యుత్, రోడ్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రాంతాలు, తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తేందుకు కారణమవుతున్న జంక్షన్లను క్షేత్రస్థాయిలో గుర్తించి, సమస్యలకు కారణాలను విశ్లేషించాలని సమావేశంలో నిర్ణయించారు.
సంయుక్త తనిఖీలు..
రోడ్ల విస్తరణకు, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, వాటర్ సప్లై వాల్వులు, మ్యాన్హోళ్లు, తాగునీటి పైప్లైన్లు, సీవరేజ్ లైన్లు తదితర యుటిలిటీలను అవసరమైన మేరకు షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కమిషనర్ సృజన సూచించారు. ఒక్కో బాటిల్నెక్కు కారణాలను గుర్తించి, సంబంధిత శాఖలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ట్రాఫిక్ పోలీస్, జలమండలి, విద్యుత్, రోడ్లు తదితర శాఖలు సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రాంతాల వారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
సమగ్ర ప్రణాళిక రూపొందించాలి.. ఎండీ అశోక్
కొత్తగా చేపట్టే రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి ముందుగానే ఆయా ప్రాంతాల్లో తాగునీరు, సీవరేజ్ నెట్వర్క్ అవసరాలను గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. ప్రస్తుతమున్న వాటర్ సప్లై, సీవరేజ్ పైప్లైన్లను మ్యాపింగ్ చేయడంతో పాటు భవిష్యత్లో అవసరమయ్యే కొత్త లైన్లు, వాటి అలైన్మెంట్లు, వాల్వులు, మ్యాన్హోళ్లను రోడ్డు నిర్మాణ ప్రణాళిక దశలోనే గుర్తించాలని తెలిపారు. ఒకసారి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వాటర్, సీవరేజ్ లైన్ల కోసం మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి రాకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న జలమండలి వాటర్ సప్లై వాల్వులు, పైప్లైన్లు, మ్యాన్హోళ్లు, సీవరేజ్ నెట్వర్క్ను సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించి, అవసరమైన చోట షిఫ్టింగ్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!
సీవరేజ్ మాస్టర్ ప్లాన్తో అనుసంధానం..
సైబరాబాద్ పరిధిలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, మురుగునీటి నిర్వహణ అవసరాలను ముందుగానే అంచనా వేయాలని జలమండలి ఎండీ అశో్క్ రెడ్డి సూచించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సీవరేజ్ పనులు జలమండలి సీవరేజ్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. టీజీఐసీసీసీ పరిధిలో ఉత్పత్తయ్యే మురుగునీరు, దాని శుద్ధి, జలమండలి సీవరేజ్ నెట్వర్క్లోకి విడుదల చేసే విధానంపైనా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం, భవిష్యత్లో ఉత్పత్తయ్యే మురుగునీటి పరిమాణాన్ని అంచనా వేసి, జలమండలి నెట్వర్క్పై అదనపు భారం పడకుండా అవసరమైన శుద్ధి, కనెక్టివిటీ, నెట్వర్క్ విస్తరణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
మాన్సూన్ పరిస్థితులపై సమీక్ష..
కన్వర్జెన్సీ సమావేశంలో భాగంగా జలమండలి డైరెక్టర్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఎండీ అశోక్ రెడ్డి మాన్సూన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సీవరేజ్ ఓవర్ఫ్లోలు, పెండింగ్ పనులు, బ్యారికేడింగ్, రోడ్డు రిస్టోరేషన్, తాగునీటి సరఫరా, వాటర్ లాగింగ్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తరచూ మురుగు పొంగే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పటిష్ఠమైన బ్యారికేడింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పైప్లైన్, సీవరేజ్ పనులు పూర్తయిన వెంటనే సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రోడ్డు రిస్టోరేషన్ చేపట్టాలని ఆదేశించారు. వర్షాల సమయంలో లోతట్టు, వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వాటర్ సప్లై, సీవరేజ్, యుటిలిటీ షిఫ్టింగ్, రోడ్డు రిస్టోరేషన్ అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయంతో ప్రాంతాల వారీగా పరిష్కార కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Also Read: మార్పుల్లేవ్.. రాంచందర్తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?