Harish Rao: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూముల అమ్మకాలే జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ప్రభుత్వ భూములు.. జాతి సంపద అని పెద్ద ఎత్తున ఉపన్యాసాలు దంచిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడవే ఆస్తులను బహిరంగంగా అమ్మకానికి పెడుతున్నారన్నారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, ఉర్దూ యూనివర్సిటీ, ఇప్పుడు రాయదుర్గ్.. ఎక్కడికక్కడ భూములు అమ్మే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
టీజీఐఐసీని ఖండించిన హరీశ్ రావు..
ప్రధానంగా.. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని పదిన్నర ఎకరాల హెరిటేజ్ భూమిని వేలం వేసేందుకు.. టీజీఐఐసీ సిద్ధం కావడాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. 2020లో ఇదే భూముల రక్షణ కోసం రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టు మెట్లు ఎక్కారని గుర్తుచేశారు. మరి ఇప్పుడే అదే భూమిని అమ్మడానికి ఎందుకు తొందరపడుతున్నారని నిలదీశారు. ఇదే సర్వే నంబర్లో గతేడాది ఎకరం 237 కోట్ల చొప్పున వేలం వేస్తే.. ఎస్బీఐ కోర్టును ఆశ్రయించిందని, ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. వివాదంలో ఉన్న భూమిని అమ్మడం న్యాయ వ్యవస్థను ధిక్కరించడమేనన్నారు.
రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు..
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చారని హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటకు విలువ లేదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ.. వివాదాస్పద భూముల్లో కొత్తగా థర్డ్ పార్టీ హక్కులను సృష్టించడం.. పరిపాలనా వైఫల్యమే అవుతుందన్నారు హరీశ్ రావు. వెంటనే.. TGIIC వేలం ప్రకటనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 83కి సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులపై.. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హరీశ్ రావు తన లేఖలో ఘాటుగా హెచ్చరించారు.
Also Read: రాజాసింగ్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి..?