Bharat Mata Temple: స్వాతంత్రం వచ్చినపుడు దేశంలో మొత్తం సంబరాల్లో తేలిపోయింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, కపాసుకుద్ది గ్రామం మాత్రం మసూచితో విషాదంలో ముగినిపోయింది. కొన్ని రోజుల్లోనే చాలా మంది చనిపోయారు. దీంతో గ్రామస్థులకు ఏం చేయాలో తెలియలేదు. తమ ప్రాణాలను ఎవరు కాపాడుతారా అని ఎదురు చూశారు. గ్రామస్తులంతా కలిసి ఊరిలోని పూజారుల దగ్గరకు వెళ్లారు. గ్రామానికి భారతమాత ఆవహించిందని.. అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయాలని వారు చెప్పారు.
భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు..
పూజాలు చెప్పినట్టుగానే గ్రామస్తులు భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. నిజంగానే భరతమాత కాపాడిందా లేదా మరేమైనా కారణం ఉందో తెలియదు కానీ గ్రామస్థుల్లో ఆ విశ్వాసం బలపడింది. అప్పటి నుంచి కపాసుకుద్దిలో భారతమాతనే గ్రామదేవతగా కొలుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భావిస్తున్నారు.
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత
గ్రామంలోని ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అక్కడ అమ్మవారికి మహిళా పూజారే అన్ని కార్యక్రమాలు చేస్తారు. తరతరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రతిరోజూ భరతమాతకు దీపారాధన, ప్రతి గురువారం భజన కచేరీలు నిర్వహిస్తారు. కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఉత్సవాలను జరుపుతారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అమ్మవారిని నమ్ముకునే బయలుదేరుతారు. తాము ఎక్కడ ఉన్నా భరతమాత తమను కాపాడుతుందనే నమ్మకం వారిలో బలంగా కనిపిస్తుంది. ఇంతటి ప్రత్యేక చరిత్ర కలిగిన భారతమాత ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: మౌలాలి MS ల్యాబ్లో డ్రగ్స్ తయారీ.. రూ. 17 కోట్ల సరుకు సీజ్!