Farmer DISCOM: తెలంగాణలో ప్రతిపాదిత రైతు డిస్కం (ఆర్పీడీసీఎల్) ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగం పుంజుకుంది. ప్రస్తుతం సంస్థ ఏర్పాటు ప్రక్రి య కొనసాగుతుండగా.. త్వరలోనే ఆర్పీడీసీఎల్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థను సమర్థంగా నడిపించడం, రైతులకు మెరుగైన సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించడంపై వచ్చే వారం హైలెవల్ కమిటీ సమావేశం జరగనుంది. సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణ, ఇతర రాష్ట్రాల అనుభవాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
అధికారులు అధ్యయనం
రైతు డిస్కం ఏర్పాటులో తెలంగాణ ఏర్పరుచుకున్న దారిలోనే హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అడుగులు వేశాయి. ఈనేపథ్యంలో ఇతర రాష్ట్రాల అనుభవాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణతోపాటు రైతు డిస్కం ఏర్పాటుపై హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధివిధానాలను పరిశీలించనున్నారు. అక్కడ సంస్థల ఏర్పాటు ఏ దశలో ఉంది? కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఎలాంటి వ్యవస్థను రూపొందించారు? వంటి అంశాలను కమిటీ చర్చించనుంది.
సమస్యలు ఏమిటి?
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో రైతు డిస్కంల పనితీరు, అమలు పరిస్థితి, విద్యుత్ సరఫరా నిర్వహణ, సంస్థాగత వ్యవహారాలు, ఆర్థికపరమైన అంశాలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వాటిని ఆయా రాష్ట్రాలు ఎలా అధిగమిస్తున్నాయి? అమల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటున్నాయి? వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో ఆర్పీడీసీఎల్ కార్యకలాపాలు ప్రారంభించే నాటికి ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను గుర్తించనున్నారు.
అధికారులు కసరత్తు
ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో వ్యవసాయ విద్యుత్ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్థ పనితీరును పర్యవేక్షించేవిధానం, అవసరమైన మానవ వనరులు, నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలపైనా హైలెవల్ కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్లో ఎదురవుతున్న సమస్యలను ముందుగానే గుర్తించి.. తెలంగాణలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఎలా ముందుకు తీసుకెళ్లాలి?
హైలెవల్ కమిటీ సమావేశం అనంతరం ఇతర రాష్ట్రాల అనుభవాలు, వాటి పనితీరు, అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమిస్తున్న విధానాలపై అధికారులు సమగ్ర విశ్లేషణ చేయనున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆర్పీడీసీఎల్ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే అంశాలపై సిఫారసులతో కూడిన పూర్తి నివేదికను సిద్ధం చేయనున్నారు.
తదుపరి కార్యాచరణ
ఈ నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ముఖ్యమంత్రి ముందుంచనున్నట్లు సమాచారం. రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, ఇతర రాష్ట్రాల నమూనాలు, వాటి పనితీరు, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు సీఎంకు వివరించనున్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ రైతు డిస్కం కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి తదుపరి కార్యాచరణకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: జాతీయ కుల గణనపై కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన మంత్రి పొన్నం!