Paddy Procurement: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ రాష్ట్ర రాజకీయాల్లోనూ, రైతుల్లోనూ బిగ్ డిబేట్కు దారితీసింది. ఇప్పటివరకు కేంద్రం మద్దతు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ధాన్యాన్ని సేకరిస్తూ వస్తోంది. అయితే, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల అదనపు భారం పడుతోంది. దాంతో.. భవిష్యత్ వ్యూహాలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం విధి విధానాల ప్రకారమే.. రాష్ట్రంలో పంట ఉత్పత్తులని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రులు తెలిపారు. ఇకపై కేంద్రం ఏయే పంటలకు మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు చేస్తుందో.. అవే పంటలను, అంతే కోటాలో సర్కార్ తరపున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏదేమైనా సరే.. కోటాకు మించి కొనబోమని కేంద్రం తేల్చి చెప్పేసింది. దాంతో.. మిగతా ధాన్యం కొంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది. రైతులు కూడా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ నుంచే కేంద్రం తక్కువ ధాన్యం కొంటోందని చెబుతున్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 236 లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. ఈ యాసంగి సీజన్లోనే 80 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని తెలంగాణ సర్కార్ కొనుగోలు చేసింది. కేంద్రం మాత్రం 53 లక్షల టన్నులకే లిమిట్ విధించింది. అంటే దాదాపు 27 లక్షల టన్నుల ధాన్యం.. గిడ్డంగుల్లోనే నిల్వ చేయాల్సి వస్తోంది. అదేవిధంగా.. 15 లక్షల టన్నుల మొక్కజొన్నను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. కేంద్రం తీసుకోవడం లేదు. తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!
కేంద్ర ప్రభుత్వం సూచించిన రకాలనే సాగు చేస్తున్నా, ధాన్యం కొనుగోళ్లపై పరిమితి విధించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. ఇందుకోసం తెలంగాణ నుంచి మంత్రులు కమిటీ ఢిల్లీ వెళ్లి.. కేంద్రమంత్రులతో చర్చలు జరపనున్నారు. యూరియా సప్లైలో అన్యాయంపై వ్యవసాయ మంత్రి తుమ్మల నేతృత్వంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలవనున్నారు. ఇప్పటికే రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించిన ప్రతి పంటను.. తెలంగాణ నుంచి కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచనుంది ప్రభుత్వం. అయితే, కేంద్రం కోటా సాకుతో ప్రభుత్వం ధాన్యం కొనకపోతే.. రైతులు దళారుల చేతిలో తీవ్రంగా నష్టపోతారని విపక్షాలు హెచ్చరిస్తున్నాయ్. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులు.. ఇప్పటికే మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని.. వరికి కూడా ఇలాంటి ఆంక్షలు పెడితే సంక్షోభం తప్పదని విమర్శిస్తున్నారు.
Also read: El Niño: నైరుతి రుతుపవనాలను మింగేస్తున్న ఎల్ నినో.. ఈ ఏడాది పంటలు దెబ్బతినే ఛాన్స్..!