Telangana SIR: తెలంగాణలో సర్ ప్రక్రియ.. ఆశలతో మొదలై అనుమానాలతో ముగిసినట్టే కనిపిస్తోంది. గడువులు పెట్టారు. టార్గెట్లు నిర్ణయించారు. కానీ అమలు దశలో మాత్రం అడ్డంకులు తప్పలేదు. చివరి రోజు నాటికి లక్ష్యాలు పూర్తయ్యాయా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కొన్నిచోట్ల మంచి స్పందన కనిపించినా… మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యాలు, సాంకేతిక సమస్యలు వెంటడాయి.
74 లక్షల పత్రాలు పెండింగ్
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 శాతానికి పైగా డిజిటైజేషన్ పూర్తయిందని గణంకాలు చెబుతున్నాయి. ఇంకా 74 లక్షల పత్రాలు పెండింగ్లో ఉండటం… ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగియలేదన్న సందేహాలను మరింత పెంచుతోంది. ఫారాలు పూర్తి చేసి ఇచ్చినా డిజిటల్ ఎంట్రీ కాలేదని కొందరు.. అసలు ఫారాలే అందలేదని మరికొందరు తలలు పట్టుకుంటున్నారు.
Also Read: జంతర్ మంతర్ సీన్స్.. రాంచీలో రిపీట్
బీఎల్వోలకు చుక్కలు కనిపించాయి..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా సాగినప్పటికీ.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. డోర్ నంబర్లు దొరక్కపోవడం, అపార్ట్మెంట్లలోకి అనుమతులు లేకపోవడం, ఐటీ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో బీఎల్వోలకు చుక్కలు కనిపించాయి. ఇక గడువు ముగిసిపోయింది.. పొడిగించే ప్రసక్తి లేదని అధికారులు తేల్చేయడంతో.. ఫారం సమర్పించని లక్షలాది మంది ఓటర్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. డెడ్లైన్ పేరు చెప్పి సాంకేతిక కారణాలతో ఏ ఒక్క పౌరుడి ఓటూ గాల్లో కలసిపోకూడదనే డిమాండ్ వినిపిస్తోంది.