Nandyal News: ఇటీవల కొందరు భార్యలు తమ భర్తలను హత్య చేసిన ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. భర్తలను చంపిన ఘటనలు కుటుంబ విలువలు, నైతికత, మానవ సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత వైరుధ్యాలు, ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటి ఘటనలకు దారుణ హత్యకు దారి తీస్తున్నాయి. సమాజంలో పెరుగుతున్న వ్యక్తిగతవాదం, సహనం తగ్గడం, భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవలే దారుణ హత్యలకు కారణమవుతున్నాయి.. కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజాన్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపే ఆస్కారం ఉంది..
కలిసి ఉందామని అత్తారింటికి వెళ్తే…
తాజాగా.. నంద్యాల జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మకు నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన పెయింటర్ రమణయ్య (48)తో దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవల కారణంగా రమణమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను నచ్చజెప్పేందుకు రమణయ్య పిడుగురాళ్లకు వెళ్లాడు. అక్కడకు వెళ్లాక మళ్లీ రమణమ్మకు, రమణయ్యకు గొడవ జరిగింది. చివరకు కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
బామ్మరిది కళ్లల్లో కారం చెల్లి కిరాతకంగా…
రమణమ్మ, ఆమె సోదరుడు కలిసి రమణయ్య కళ్లలో కారం చల్లి దాడి చేశారు. ఆ తర్వాత అతడిని కొట్టి కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమణయ్య సంఘటనా స్థలంలోనే మరణించాడు. రమణమ్మ కుటుంబ సభ్యులు రమణయ్య మృతదేహాన్ని కారులో నంద్యాలకు తీసుకొచ్చి, అతడి ఇంటి ముందు వదిలేశారు. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. రమణయ్య కుమార్తెలు తమ తండ్రి మరణానికి తల్లి, మామలు కారణమని చెబుతున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి…
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. కుటుంబ కలహాలు ఇంతటి దారుణ ఫలితాలకు దారితీస్తాయని, ఇలాంటి ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ కేసులో లోతైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy: ఉపరాష్ట్రపతి పదవి ఆయనకు ఇవ్వాల్సిందే.. ఇండియా కూటమితో నేను మాట్లాడుతా: సీఎం రేవంత్
ALSO READ: IB Recruitment: టెన్త్ అర్హతతో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.69,100 జీతం