Pushpa 2: ‘పుష్ప 2’ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీ ప్రీమియర్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దానికి కారణం ఆరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటనే. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ను చూడడానికి చాలామంది అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్.. సంధ్య థియేటర్కు చేరుకున్నారు. పైగా ఈ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి వస్తాడని తెలిసి అధిక సంఖ్యలో ప్రేక్షకులు అక్కడికి వచ్చారు. హీరో రాగానే జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. అందుకే ‘పుష్ప 2’ టీమ్పై కేసు నమోదయ్యింది. కానీ ఆ కేసు నుండి ఇద్దరు నిర్మాతలకు విముక్తి లభించింది.
సమాచారం అందించాం
‘పుష్ప 2’ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. యెలమంచిలి రవి శంకర్, నవీన్ యేర్నేని ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో రవి శంకర్, నవీన్ యేర్నేని కూడా నిందితులే అని వారిపై కేసు నమోదయ్యింది. హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. నిర్మాతలు గానీ, ఇతర మూవీ టీమ్ గానీ ప్రీమియర్స్కు అల్లు అర్జున్ వస్తున్నాడని, రోడ్ షో చేస్తున్నాడని చెప్పకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని మొదటి నుండి పోలీసులు ఆరోపిస్తూనే ఉన్నారు. దానికి కౌంటర్గా తాము ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించామని నిర్మాతలు అన్నారు.
Also Read: మెగాస్టార్ కొడుకు అనిపించుకున్నాడు… చరణ్కు సలాం కొడుతున్న మెగా ఫ్యాన్స్
సంబంధం లేదు
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని వారు ఊహించకపోవడంతో సెక్యూరిటీని కూడా మామూలుగా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ వచ్చిన ప్రేక్షకులకు ఆ సెక్యూరిటీ సరిపోలేదు. దానికి తాము కారణం కాదంటూ ‘పుష్ప 2’ నిర్మాతల తరపున లాయర్ వాదించారు. పోలీసులకు ఈ విషయాన్ని ముందుగానే చెప్పామని, అందుకే థియేటర్ వల్ల భారీగా పోలీసుల బందోబస్తు ఉందని గుర్తుచేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఈ ఘటన జరిగిందని అన్నారు. దానికి నిర్మాతలపై నింద పడడం ఏంటని, వారిని ఈ కేసు నుండి తొలగించమని లాయర్ తెలిపారు.
విముక్తి దొరికింది
‘పుష్ప 2’ (Pushpa 2) నిర్మాతల తరపున లాయర్ చేసిన వాదనలు కరెక్ట్ అని హైకోర్టు సమ్మతించింది. అందుకే సంధ్య థియేటర్ ఘటనలో నిర్మాతలను నిందించొద్దని తేల్చేసింది. వారిని అరెస్ట్ చేయొద్దని ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. అంతే కాకుండా దీనికి కౌంటర్గా పోలీసులను ఒక అఫీడవిట్ ఫైల్ చేయమని చెప్పింది. రెండు వారాల్లో కోర్టు హియరింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పుష్ప 2’ నిర్మాతలు ఈ కేసు నుండి విముక్తి లభించింది. కానీ రోజులు గడుస్తున్నాకొద్దీ అల్లు అర్జున్ మాత్రం ఈ కేసు నుండి బయటపడే ఛాన్స్లు తక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.