Balochistan Kills Hostages| పాకిస్తాన్ (Pakistan)లోని వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు మంగళవారం ప్రయాణికుల రైలును హైజాక్ (Train Hijack) చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కీలక ప్రకటన చేసింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైన్యాన్ని చంపేసామని పేర్కొంది. ఆపరేషన్ ముగిసిందంటూ ఇస్లామాబాద్ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా ఖండించింది.
Also Read: ఇండియాను ఫాలో అవుతున్న ట్రంప్.. అమెరికాలో వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు!
“మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చాం. మా చెరలో బందీలుగా ఉన్న పాకిస్తానీలను రక్షించుకునేందుకు సైన్యానికి మేము ఇచ్చిన చివరి అవకాశం ముగిసింది. కానీ, పాక్ ప్రభుత్వం తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. ఫలితంగా శత్రు సైన్యానికి (పాక్ ప్రభుత్వానికి) చెందిన 214 మందిని మేం చంపేశాం. బీఎల్ఏ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. అయితే ఇస్లామాబాద్ సైన్యం తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా మాతో పోరాడాలని ప్రయత్నించింది. ఫలితంగా బందీలను కోల్పోయింది. జాఫర్ ఎక్స్ప్రెస్ బోగిల్లోని బందీలను రక్షించేందుకు పాకిస్తాన్లోని ఎస్ఎస్జీ కమాండోలు రాగానే మా యోధులు వారిని చుట్టిముట్టి భీకర దాడి చేశారు. గంటల పాటు సాగిన ఈ పోరులో పలువురు బందీలను ఉరితీయగా.. కమాండోలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూశారు. మా వాళ్లు చివరి బుల్లెట్ వరకు పోరాడారు.
చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని ఇస్లామాబాద్ ప్రభుత్వం వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతోంది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైంది. యుద్ధ సూత్రాలకు కట్టుబడి మేం విడుదల చేసిన వారిని కాపాడినట్లు ప్రకటించుకుంటుంది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. బలూచ్ యోధులు వివిధ ప్రాంతాల్లో మొరుపుదాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. బలూచ్ ఆర్మీ ఈ ఆపరేషన్లో విజయం సాధించింది” అని మిలిటెంట్ సంస్థ పేర్కొంది. రైలు హైజాక్ ఆపరేషన్లో మరణించిన బలోచ్ మిలిటెంట్లకు ఆ ఉగ్రవాద సంస్థ నివాళులర్పించింది.
పాక్లోని క్వెట్టా నుంచి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ (Jaffar Express)ను బలూచ్ వేర్పాటువాదులు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించగా.. దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి మిగతా ప్రయాణికులు అందరినీ సురక్షితంగా విడిపించామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. బలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులని పాక్ ఆర్మీ కూడా పేర్కొంది. ఇక, ఈ ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే, బలూచ్ మిలిటెంట్లు ఇందుకు విరుద్ధంగా పేర్కొనడం గమనార్హం.
బలోచిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటే లక్ష్యం
బలోచిస్తాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, కానీ ప్రాంతంలో పేదరికం అధికం. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత, బలోచ్ నాయకుడు అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర రాష్ట్రం కోరుకున్నాడు. కానీ పాకిస్తాన్ సైన్యం ఒత్తిడితో 1948లో విలీనం జరిగింది. ఈ అసంతృప్తి నేటికీ కొనసాగుతోంది. 2000లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఏర్పడింది. వారి లక్ష్యం సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేయడం. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ దళాలు ఏకమై, పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. బీఎల్ఏను ఇప్పుడు ఉగ్రసంస్థగా పాకిస్తాన్, బ్రిటన్ ప్రభుత్వాలు గుర్తించాయి.