Modi Trump Meeting Tariffs H1B | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టని తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అగ్రరాజ్యం పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా సాంకేతికత, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ప్రపంచ భద్రతా సమస్యలు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య యుద్ధం ప్రారంభించారు. తన మన తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలను సుంకాలతో బెదిరిస్తున్నారు.
చైనా ఉత్పత్తులపై 10 శాతం అదనపు సుంకాలు విధించినట్లే.. అమెరికాలో దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధించారు. భారత్ కూడా అమెరికాకు అల్యూమినియం, స్టీల్ ఎగుమతి చేస్తోంది కాబట్టి.. ఈ సుంకాల ప్రభావం భారత్పై కూడా ఉంటుందని మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా విధించిన ఆంక్షల ప్రస్తావన కూడా మోదీ-ట్రంప్ మధ్య చర్చల్లో జరుగుతుందని భావిస్తున్నారు.
“స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించారు. భారత్ కూడా ఈ రెండు వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అలాగే, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు చాబహార్ పోర్టుపై ఆంక్షలు విధించడం భారత్కు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మధ్యఆసియా, అఫ్గానిస్థాన్తో భారత్కు కనెక్టివిటీ కల్పించడంలో చాబహార్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశాలు మోదీ-ట్రంప్ మధ్య చర్చల్లో భాగమవుతాయని నేను భావిస్తున్నాను.” అని మాజీ దౌత్యవేత్త అనిల్ త్రిగుణాయత్ అభిప్రాయపడ్డారు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా ఉండనున్నాయి. గతంలో, అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అయితే, మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే అమెరికా నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు వంటి కొన్ని దిగుమతులపై టారిఫ్లు తగ్గించారు.
“ఇండియా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ట్రంప్ మరిన్ని సుంకాలు విధిస్తానని పదే పదే చెబుతున్నారు. ఇది వాణిజ్య లోటును తగ్గించడానికి కాదు, అమెరికాకు ఆదాయాన్ని సృష్టించడానికి, సరిహద్దు పన్ను ద్వారా తమకు ఆదాయాన్ని పెంచుకోవడానికి అని వాదిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన పరిశ్రమలను రక్షించుకోవాలి. ఇది సహజం. భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటోంది.” అని అనిల్ సూచించారు.
Also Read: ట్రంప్ బాటలో యుకె.. బ్రిటన్లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!
ఉగ్రవాద వ్యతిరేకంగా సంయుక్త పోరాటం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై కూడా మోదీ-ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా తన రక్షణ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తోంది. భారత్కు F-35 యుద్ధ విమానాలను అమ్మాలని అమెరికా యోచిస్తోంది. ఇదే సమయంలో, సంయుక్త సైనిక విన్యాసాలను (మిలిటరీ డ్రిల్స్) మరింత విస్తరించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. సాంకేతికత బదిలీ (టెక్నాలజీ ట్రాన్స్ఫర్) ఒప్పందాలపై కూడా చర్చలు జరగనున్నాయి. చైనా నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు యోచిస్తున్నాయి.
“ట్రంప్ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో నేర్పరి. అతని ప్రధాన లక్ష్యం సుంకాల ద్వారా భారత్పై ఒత్తిడి తీసుకురావడం, అమెరికా రక్షణ పరికరాలను భారత్ కొనుగోలు చేయడం. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో భారత్-అమెరికా మధ్య పెద్ద రక్షణ ఒప్పందాలు జరగనున్నాయని నేను భావిస్తున్నాను.” అని మరో మాజీ దౌత్యవేత్త భాస్వతి ముఖర్జీ చెప్పారు.
H1B వీసాలు?
అక్రమ వలసదారులు, H1B వీసాల అంశం కూడా మోదీ-ట్రంప్ మధ్య చర్చల్లో ప్రధానం కానుంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 100 మందికి పైగా భారతీయులను ఇటీవల సైనిక విమానంలో తిరిగి పంపించారు. భారతీయులకు అమెరికా వీసాలు తగ్గించబడతాయని వార్తలు వినిపిస్తున్న సమయంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి మోదీ ట్రంప్తో చర్చించే అవకాశం ఉంది. H1B వీసాలు, విద్యార్థి వీసాలపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మోదీ యత్నించవచ్చు.
“H1B వీసా అంశం భారత్కు చాలా ముఖ్యమైనది. అమెరికాలో అనేక భారతీయ సంస్థలు పని చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు కూడా భారత్ నుంచి ఐటీ ఉద్యోగులను కోరుకుంటున్నాయి. ట్రంప్ తొలుత H1B వీసాలను రద్దు చేస్తానని చెప్పారు, కానీ ఇప్పుడు అమెరికాలో పని చేయడానికి నైపుణ్యం కలిగిన తెలివైన వ్యక్తులు కావాలని అంటున్నారు. ఈ క్రమంలో భారత ఉద్యోగులను కూడా ట్రంప్ మెచ్చుకున్నారు. అందుకే H1B వీసాల విషయంలో ట్రంప్ చెప్పినంత కఠినంగా వ్యవహరించపోవచ్చు” అని రక్షణ నిపుణుడు ఖమర్ అఘా అభిప్రాయపడ్డారు.
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై కూడా మోదీ-ట్రంప్ చర్చించనున్నారు. అమెరికాతో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకుంటూనే, రష్యా, ఇరాన్తో భారత్కు మెరుగైన సంబంధాలు ఉండటం, ఆంక్షలు, ఉమ్మడి జాతీయ సమస్యలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.