Nepal floods Report| నేపాల్ వరదల బీభత్సం ధాటికి ఇప్పటివరకు దాదాపు 579 చనిపోయారు, 2000కు పైగా గల్లంతయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైపరీత్యానికి నిజమైన కారణం ఏంటని అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు ఈ దుర్ఘటన గురించి 5 నెలల క్రితమే సమాచారం ఉంది.
2026 మార్చిలో విడుదలైన రెండు వాతావరణ నివేదికలు.. హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిస్థితులను వెల్లడించాయి. హిమాలయాల్లో హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయని నివేదికలు హెచ్చరించాయి. నేపాల్లో ఇటీవల సంభవించిన ప్రాణాంతక వరదల తరువాత ఈ రిపోర్ట్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వరదలకు అసలు కారణాలను శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పులు, మంచు కరగడం వంటి అంశాలను నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ICIMOD) మార్చిలో రెండు ముఖ్యమైన నివేదికలను విడుదల చేసింది. ఈ సంస్థ హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని పలు దేశాలతో కలిసి పనిచేస్తుంది. ఇందులో భారత్, నేపాల్, భూటాన్, చైనా వంటి దేశాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి హిమానీనదాల మంచు కరిగిపోవడం వేగంగా జరుగుతోంది.
గత సంవత్సరాలతో ఈ హిమ నష్టం గణనీయంగా పెరిగింది. 1975 నుంచి కొన్ని హిమానీనదాలు 27 మీటర్ల వరకు మంచు మందాన్ని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని రిపోర్ట్లో ఉంది.
హెచ్కెహెచ్ గ్లేసియర్ ఔట్లుక్ 2026 నివేదిక 38 హిమానీనదాల సమాచారాన్ని పరిశీలించింది. 2000 సంవత్సరం తర్వాత హిమానీనదాల క్షీణత రెండింతలైందని పరిశోధకులు గుర్తించారు. హిమాలయ మంచు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు కీలక మార్పుల దశకు చేరుతున్నాయని నివేదిక హెచ్చరించింది. కొన్ని హిమానీనదాలు తిరిగి కోలుకోలేని స్థాయిలో వెనక్కి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే, హిమానీనదాల పర్యవేక్షణలో ఇంకా అనేక లోపాలు ఉన్నాయి. పరిశీలించిన 38 హిమానీనదాల్లో కేవలం ఏడు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాయి. కరాకోరం, సిక్కిం, జంస్కార్, భూటాన్ ప్రాంతాల్లో పర్యవేక్షణ తక్కువగా ఉంది.
ప్రపంచంలో ఉన్న ధ్రువ ప్రాంతాల హిమనీనాదాల తరువాత హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో అత్యధిక మంచు నిల్వలు ఉన్నాయి. ICIMOD ప్రకారం.. ఈ ప్రాంతంలో 63,700కు పైగా హిమానీనదాలు ఉన్నాయి. ఇవి 55,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. ఈ హిమానీనదాలు ఆసియాలోని పది ప్రధాన నదీ వ్యవస్థలకు నీటిని అందిస్తాయి. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, జీవనోపాధికి ఈ నదులు ఎంతో కీలకం.
నేపాల్లో సంభవించిన భారీ వరదలకు అనేక కారణాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 4,000 మీటర్లకుపైగా ఎత్తులో మంచుకు బదులు వర్షం పడటం ప్రధాన ఆందోళనగా మారింది. వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం ఈ మార్పునకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మంచు కవచం తగ్గడం, హిమానీనదాలు వెనక్కి తగ్గడం కూడా ప్రమాదాలను పెంచవచ్చు.
ఒక మంచు-రాయి అవలాంచ్ వరదలకు కారణమైందా అనే అంశాన్ని ICIMOD పరిశోధకులు పరిశీలిస్తున్నారు. భారీ మంచు, రాళ్లు లెండే ఖోలా ప్రవాహంలోకి చేరి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ప్రవాహం భోటే కోషి నదీ సిస్టమ్తో అనుసంధానమై ఉంది. ఆకస్మికంగా వచ్చిన నీటి ప్రవాహం మట్టి, రాళ్లు, పెద్ద బండరాళ్లను దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండవచ్చు.
హిమానీనదాల నష్టం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదని ICIMOD తెలిపింది. తూర్పు హెంగ్డువాన్ షాన్ పర్వతాల్లో కొన్ని ప్రాంతాలు 33 శాతం వరకు హిమానీనద ప్రాంతాన్ని కోల్పోయాయి.
సిందూ, గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యధిక మొత్తం మంచు ప్రాంత నష్టం నమోదైంది. అందువల్ల హిమాలయ హిమానీనదాల నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తుకు అత్యంత అవసరంగా మారింది.
ఇటీవలి విపత్తుకు మానవ నిర్మిత అభివృద్ధి కారణమని అనుమానాలున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, ఈ ఘటన హిమాలయ ప్రాంతంలో జరుగుతున్న భారీ నిర్మాణాలపై ఆందోళనలు పెంచుతోంది.
Also Read: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు.. ఏడాదికి రూ.600 కోట్లు సంపాదన.. ఎలాగంటే
చైనా హిమాలయ ప్రాంతంలో భారీ డ్యామ్లు, సొరంగాలు, రహదారులు, రైల్వేలు, వంతెనల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తోంది. విద్యుత్ అవసరాలు, వనరులు, సరిహద్దు భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోంది. భారత్, నేపాల్ కూడా ఈ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
నిపుణుల ప్రకారం.. గతంలో అరుదుగా నమోదైన భారీ వరదలు ఇప్పుడు తరచుగా సంభవిస్తున్నాయి. వాతావరణ ప్రమాదాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను కూడా ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.