Houthi Attack Israel Airport| ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ ఆసియా ప్రాంతం మళ్లీ యుద్ధరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా, యెమెన్ నుంచి హూతీలు క్షిపణి దాడులు చేశారు. ఇజ్రాయెల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అయితే, ఆ క్షిపణిని ఇజ్రాయెల్ సైన్యాలు నేలకూల్చినట్లు ప్రకటించాయి.
ఈ దాడులకు బాధ్యత వహిస్తూ, హూతీ తిరుగుబాటు దళాల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ ప్రకటన జారీ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముగిసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని అన్నారు. 48 గంటల్లో ఇదే మూడోసారి దాడులు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఎర్ర సముద్రంలోని అమెరికా విమానవాహక నౌక ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్. ట్రూమాన్’పై కూడా హూతీలు దాడులు చేశారని పేర్కొన్నారు. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు సురక్షితం కావని ప్రయాణికులను హెచ్చరించారు. అయితే, బెన్ గురియన్ విమానాశ్రయానికి సంబంధించిన వెబ్సైట్ సాధారణంగానే పనిచేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్ నౌకలపై దాడులు కొనసాగిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ‘ఉగ్రవాద స్థావరాలు మరియు ఉగ్రవాద నేతలపై మన ధైర్యశాలి యోధులు ఆకాశ దాడులు చేస్తున్నారు. మన నౌకా స్థావరాలు, వాయుస్థావరాలు, నౌకాదళాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయాన వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Also Read: గాజా భూభాగాన్ని ఆక్రమించండి.. సైన్యానికి ఇజ్రాయెల్ ఆదేశాలు
ప్రపంచంలో ఎక్కడైనా జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించకుండా ఏ ఉగ్రవాద శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. హూతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించారు. ఈ విషయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ స్పందిస్తూ.. హూతీల దాడుల్లో తమ ప్రమేయం లేదని తెలిపారు. వారు స్వంత కారణాల వల్ల దాడులు చేస్తున్నారని, ఈ విషయంలో అమెరికా తమపై ఆరోపణలు చేస్తే తగిన ప్రతిఫలం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా దాడులను హూతీల రాజకీయ బ్యూరో యుద్ధ నేరంగా నిందించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి హతం
గాజాపై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. గాజాలో మరింత భూభాగం ఆక్రమించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా మరణించగా, అనేకమంది గాయపడ్డారు. హమాస్ ఈ దాడులను తీవ్రంగా ఖండించి, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హమాస్ బందీలు విడుదలయ్యే వరకు గాజా భూభాగాలను ఆక్రమిస్తామని హెచ్చరించారు. ఫ్రాన్స్ ఈ పరిస్థితిని తప్పుబట్టి, ఇరు దేశాలు శాంతితో జీవించాలని కోరింది.