India Pakistan Border Close: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన కారణంగా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కు నీరు సరఫారా కాకుండా సింధూ నది ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న బార్డర్ ను మూసివేయాలని ప్రకటించింది. అయితే బార్డర్ సీల్ చేయడంతో చాలా కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ లో స్థిరపడిన కుటుంబాలు వారి బంధువులు ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన ఒక వివాహం ఇప్పుడు ఆగిపోయింది.
బార్దర్ మూసివేత ఆంక్షల కారణంగా రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ అనే పౌరుడికి పాకిస్తాన్ లో నివసించే యువతితో నిశ్చయమైన వివాహం ఇప్పుడు ఆగిపోయింది. బార్డర్ సీల్ చేయడంతో రాకపోకలు ఆగిపోయి వివాహం నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన ఈ వివాహం నిలిచిపోయిందని వరుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్కు అట్టారి సరిహద్దు దాటి పాకిస్తాన్లో నివసిస్తున్న ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వరుడి బంధువుల్లో చాలామంది ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకున్నారు. అయితే, ఇదే సమయంలో పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ రాక్షస ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసివేయడంతో వధువు ఇంటికి వెళ్లేందుకు సైతాన్సింగ్ ఇప్పుడు అవకాశం కోల్పోయాడు. ఈ సమస్య గురిచిం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. “ఉగ్రవాదులు చేసిన ఈ దాడి పూర్తిగా తప్పు. సరిహద్దు మూసివేత కారణంగా పాకిస్తాన్కు వెళ్లేందుకు అనుమతి లభించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి,” అని సైతాన్సింగ్ వాపోయారు.
ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇండియాలోనే కాదు అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అక్కడ నివసించే భారతీయులపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఇరు దేశాలు పొరుగు దేశం నుంచి వచ్చిన వారి వీసాలు రద్దు చేస్తూ ప్రకటించాయి. పంజాబ్ బార్డర్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో నివసించే అలీ అనే ఏసీ టెక్నీషియన్ కు ఇండియలో నివసించే యువతితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే అతని భార్యకు ప్రస్తుతం అక్కడ పాకిస్తానీ పౌరసత్వం లభించలేదు. అందుకే ఆమె టూరిస్ట్ వీసాపై నివసిస్తోంది. ఇప్పుడు వీసాలు రద్దు చేయడంతో ఆమె కూడా తాత్కాలికంగా ఇండియా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమస్య కారణంగా అలీ పాకిస్తాన్ లో ప్రభుత్వ కార్యలయాల చుట్టూ తన భార్య వీసా రద్దు చేయకూడదని, మినహాయింపు ఇవ్వాలని తిరుగుతున్నాడు.
Also Read: పహల్గాంలో ఉగ్రదాడికి భద్రతా లోపమే కారణం.. తప్పు ప్రభుత్వానిదే.. కాంగ్రెస్ విమర్శలు
మీడియాతో అలీ మాట్లాడుతూ.. “నిజమైన ఉద్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించండి. వారిని చంపేయండి. తప్పు లేదు. కానీ మా లాంటి సామాన్యులపై ఆంక్షలు విధిస్తే ఎలా?. ఇండియా, పాకిస్తాన్ దేశాలు విడిపోయినా.. ఇంకా చాల కుటుంబాలు ఇరు వైపులా కలిసే ఉన్నాయని. అలాంటి వారిని ఇబ్బందులు చేయడం న్యాయమేనా?” అని ప్రశ్నిస్తున్నాడు.
భారత్ కశ్మీర్ కు చెందిన యాస్మీన్ అనే మహిళ పాకిస్తాన్ లో వివాహం చేసుకొని అక్కడే పౌరసత్వం పొందింది. ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను కలిసేందుకు ఇండియా వస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇండియాలో వీసా తీసుకొని తన పుట్టింట్లో ఉన్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తానీలకు వీసా రద్దు చేసింది. ఇది తెలిసి యాస్మీన్ హడావుడిగా బార్డర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది.