Trump Tariff Indian Economy Loss | అమెరికా వివిధ దేశాలతో, ముఖ్యంగా చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. అంటే అమెరికా నుంచి చైనాకు ఎగుమతి అయ్యే వస్తువుల విలువ కంటే, చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువ ఎక్కువగా ఉంది. 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.
“ప్రతీకార సుంకాల విషయంలో భారతదేశాన్ని కూడా మినహాయించే అవకాశం లేదు.” భారతదేశ ప్రధాన మంత్రి మోదీతో ఇటీవల జరిగిన సమావేశంలో రోజునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
ట్రంప్ టారిఫ్లు ఎందుకు విధిస్తున్నట్లు?
విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్లు విధిస్తుంది.
ప్రజలపై అధిక దిగుమతి సుంకాల తీవ్ర ప్రభావం
దేశీయ పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశ్యంతో విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు, ఒక వాహన కంపెనీ తమ దేశంలో తయారు కాని విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది ముడి పదార్థాల ధరలను పెంచి, అంతిమ ఉత్పత్తి ధరను కూడా పెంచుతుంది. ఫలితంగా, ఇలాంటి సుంకాలు దేశీయ వినియోగదారులపై కూడా భారం అవుతాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది. డెయిరీ ఉత్పత్తులు: 188%, పండ్లు మరియు కూరగాయలు: 132%, తృణ ధాన్యాలు: 193%, నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%, పానీయాలు మరియు పొగాకు: 150%, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%, చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%.
Also Read: మోదీ ముందే ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. మేము కూడా అదే చేస్తామంటూ…
ఔషధాలు, రత్నాభరణాలు, ఐరన్ అండ్ స్టీల్ (ఉక్కు, ఇనుము), వాహనాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, జౌళి, వస్త్రాలు, ఆహార పదార్థాలు.
ప్రతీకార సుంకాల ప్రభావం తక్కువగా ఉండవచ్చు: జీటీఆర్ఐ
అమెరికా నుంచి భారతదేశం మరింత చమురు, గ్యాస్, సైనిక పరికరాలు కొనుగోలు చేస్తుందని వాషింగ్టన్లో ప్రధాన మంత్రి మోదీతో చర్చల తర్వాత ట్రంప్ ప్రకటించారు. ఇది అమెరికా వాణిజ్య లోటును తగ్గిస్తుంది. అమెరికా సుంకాలు పెంచడం వల్ల భారతదేశంపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) తెలిపింది. భారతదేశానికి అమెరికా ఎగుమతి చేసే వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. రెండు దేశాల మధ్య ఎగుమతుల్లోని వైవిధ్యం కారణంగా ప్రతీకార సుంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ప్రపంచదేశాలకు 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి అయ్యాయి, ఇందులో 31.35% అమెరికాకు ఎగుమతి అయింది.
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించిన భారత్
హార్లే డేవిడ్సన్ భారతదేశానికి చెందిన హీరో మోటోకార్ప్తో భాగస్వామ్యంగా తయారు చేసిన మోటార్సైకిళ్ళపై సుంకాలు తగ్గించబడ్డాయి.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే బోర్బన్ విస్కీపై సుంకాలు 50%కు పరిమితం చేయబడ్డాయి.
స్టాక్ మార్కెట్లకు రూ.లక్షల కోట్లు నష్టం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు పెంచడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కారణంగా.. భారతీయ స్టాక్ మార్కెట్ పై కూడా ప్రభావం పడింది. 2024 సెప్టెంబరు 27 నాటికి బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.477.93 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఇది రూ.400.19 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, నాలుగున్నర నెలల్లోనే రూ.77.74 లక్షల కోట్ల మార్కెట్ విలువ క్షీణించింది. ఇది 2024 ఏప్రిల్ 8 నాటి స్థాయికి తగ్గింది. అంటే, 10 నెలల క్రితం స్థాయికే మార్కెట్ విలువ తగ్గింది.
2024 సెప్టెంబరు 27 నాటికి మార్కెట్ సంపద విలువ రూ.478 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.78 లక్షల కోట్లు నష్టపోయి.. 2025 ఫిబ్రవరి 14 నాటికి రూ.400 లక్షల కోట్లుగా మిగిలింది.
ట్రంప్ టారిఫ్లు, అమెరికా ఆర్థిక విధానాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ప్రభావాలు మరింతగా గమనించాల్సిన అవసరం ఉంది.