Kenya Helicopter Crash: ఉత్తర కెన్యాలోని సంబూరు కౌంటీలో గురువారం ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి బయలుదేరి ఇవాసో నైరో ప్రాంతానికి వెళ్తున్న ఒక హెలికాప్టర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విషాదకర సంఘటనలో పైలట్తో సహా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నారని వాషింగ్టన్లోని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. మృతుల్లో ప్రముఖ వార్తా సంస్థ ఎన్బీసీ (NBC) ఎగ్జిక్యూటివ్ జోస్ సువెరెజ్తో పాటు ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ అధిపతి సెన్సీ కూడా ఉన్నారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో స్థానిక అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనపై అమెరికా అధికారులు విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: రేవంతే మా రోల్ మోడల్.. ఢిల్లీ భేటీలో సిడబ్ల్యూసీ సంచలన నిర్ణయాలు!