Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీడబ్ల్యూసీ ప్రశంసల వర్షం కురిపించింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై అధిష్ఠానం తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకుంటున్న కీలక నిర్ణయాలను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండున్నరేండ్ల పాలనలో సాధించిన పురోగతిని సీఎం సుదీర్ఘంగా వివరించారు.
స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు..
కాంగ్రెస్ పాలనలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కుల గణన సమగ్రంగా సాగిందని, ఇది దేశానికే ఒక ‘రోల్ మోడల్ గా నిలిచిందని అధిష్ఠానం కొనియాడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని ,అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య భరోసా కల్పించామన్నారు.
కేంద్ర విధానాలపై యుద్ధభేరి – డీలిమిటేషన్కు తీవ్ర వ్యతిరేకత
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సీడబ్ల్యూసీ తీవ్రంగా వ్యతిరేకించింది.లోక్సభలోని ప్రస్తుత 543 స్థానాల బలానికి అనుగుణంగానే మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లోపాలు, అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబాట్లపై మోదీ సర్కార్ లొంగుబాటు విధానం,అయోధ్య ‘చందా చోరీ’ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృత పోరాటం చేయాలని నిర్ణయించారు.ఈ ప్రతిష్ఠాత్మక భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్లతో పాటు 88 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్తో పాటు కేరళ నేత వి.డి. సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కే. శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
Also Read: 9 ఏళ్లుగా ఆగని కన్నీటి పోరాటం.. కర్నూలు టూ అమరావతి వీల్ చైర్ యాత్ర ఉద్రిక్తం!