Pakistan Sindu Water| యుద్ధంలో ఓడిపోయినా.. పాకిస్తాన్ బుద్ది మార్చుకోలేదు. మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించింది. పాక్ సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సింధూ నది నీళ్లను భారత్ ఆపితే, భారతీయుల ఊపిరి ఆపేస్తామని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా ఇలాంటి బెదిరింపులు చేశాడు. ఒక సైన్యాధికారి ఉగ్రవాదిలా మాట్లాడటం ఏంటని సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. “మా నీళ్లను భారత్ ఆపితే, మేము భారతీయుల ఊపిరిని ఆపేస్తాం” అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని కొంత భాగం నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా పాకిస్తాన్ రాష్ట్రపతి కుమారుడు బిలావల్ భుట్టో సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధూ నది జలాల ఒప్పందం కుదిరింది. ఇది సింధూ నది, దాని ఉపనదుల నీటి పంపిణీ భారత్, పాక్ వాటాలకు సంబంధించింది. గతంలో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కూడా ఇలాంటి బెదిరింపులు చేశాడు. ఇప్పుడు హఫీజ్ సయీద్ లాగే లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతున్నారు.
మరోవైపు, రాజస్తాన్లోని బికనీర్లో జరిగిన సభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఈ అంశంపై గట్టిగా సమాధానమిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతిస్తే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. “భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాకిస్తాన్కు ఖరీదైన వ్యవహారం అవుతుంది” అని అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు పట్టపగలు పెద్ద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వం, సైన్యం సహకారం అందిస్తోందని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే బహిరంగంగా తిరుగుతున్నారని, వారి కార్యకలాపాల గురించి అందరికీ తెలుసని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ నటించకూడదని హెచ్చరించారు.
Also Read: పాకిస్తాన్ కోసం విదేశీ ఇన్ఫ్లూయెన్సర్లు.. ఉగ్రవాదం ఇమేజ్ని చెరపడానికే..
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీని తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 23న సింధూ జలాల ఒప్పందంలో కొన్ని భాగాలను నిలిపివేసింది. భారత్ ఈ నిర్ణయం ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు తీసుకుంది. కానీ పాకిస్తాన్ బెదిరింపు వ్యాఖ్యలతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.