Pakistan Foreign Influencer| పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ ఇమేజ్ను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. భారత్లో ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధం ఉన్నట్లు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆమె పాకిస్తాన్ అనుకూలమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే జ్యోతి మల్హోత్రా ఒక్కటే కాదు ఆమె లాంటి మరింత మంది పాకిస్తాన్ ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళా ఇన్ఫ్లూయెన్సర్లను ఉపయోగించి తమ దేశాన్ని సురక్షితమైన, అభివృద్ధి చెందిన దేశంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తన్ లో మహిళలకు భద్రత, విద్య, అభివృద్ధి వంటి అంశాలపై ఈ ఇన్ఫ్లూయెన్సర్లు వీడియోలు, పోస్టులు చేస్తున్నారు.
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల నుంచి కనీసం ఐదుగురు ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు. వీరు పాకిస్థాన్ నగరాలు, గ్రామాలు, పాఠశాలలను సందర్శిస్తూ అక్కడి ఆతిథ్యం, అభివృద్ధిని పొగుడుతూ వీడియోలు చేస్తున్నారు. వీరికి స్థానిక సహాయకులు, పోలీసులు తోడుగా ఉంటున్నారు.
ఉదాహరణకు.. “షమోజై మ్యాంగోస్” అనే యూట్యూబ్ ఛానల్ను బ్రిటన్కు చెందిన రెబెక్కా అనే ఇన్ఫ్లూయెన్సర్ నడుపుతోంది. గత రెండేళ్లలో ఆమె 23 వీడియోలు పాకిస్తాన్ గురించి మాత్రమే రూపొందించింది. ఆమె తనను ట్రావెల్ బ్లాగర్గా చెప్పుకుంటూ.. ఆమె చేసిన కంటెంట్ పూర్తిగా పాకిస్తాన్పైనే చిత్రీకరించింది. “పాకిస్తాన్ ప్రమాదకరమని చెప్పారు, కానీ నేను స్వయంగా చూడాలనుకున్నాను” అని ఆమె ఒక వీడియోలో చెప్పింది. మరో వీడియోలో ఆమె పాకిస్తాన్ పోలీసులతో కలిసి దేశం సురక్షితమని, మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని చెప్పింది. ఆమె ఫేస్బుక్ పేజీలో 63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టును సమర్థిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుతూ పోస్టులు చేస్తుంది.
ఇలాంటి కంటెంట్ మరో ఇన్ఫ్లూయెన్సర్ ఫ్లోరా గోనిన్ (నెదర్లాండ్స్) వీడియోల్లో కూడా కనిపిస్తుంది. ఆమె ఛానల్లో 90,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 40 వీడియోల్లో 22 పాకిస్తాన్ గురించినవే. ఆమె బహవల్పూర్లో “పరిమిత ప్రాంతాలు” అని చెప్పబడే ప్రాంతాలను సందర్శించి.. ఆ ప్రాంతాలు కూడా చాలా సురక్షితమని చెప్పింది. ఆమెకు పోలీసులు భద్రత కల్పించడం విశేషం. అమెరికాకు చెందిన వాలీ బీ, ఆస్ట్రేలియాకు చెందిన ఇరీనా యమిన్స్కా, స్కాట్లాండ్కు చెందిన అలన్ & షానన్ వంటి ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఇదే తరహాలో కంటెంట్ను రూపొందిస్తున్నారు.
పాకిస్తాన్ ఈ మహిళా ఇన్ఫ్లూయెన్సర్లను ఎంచుకోవడం వెనుక ఉద్దేశం స్పష్టం. వీరు ప్రపంచ ప్రేక్షకులకు నమ్మకంగా, సహజంగా కనిపిస్తారు. పాకిస్తాన్ సురక్షితమని, మహిళలకు అనుకూలమని ఈ వీడియోలలో చెప్పడం ద్వారా దేశ ఇమేజ్ను మెరుగుపరచాలని చూస్తోంది. మరోవైపు అమెరికా వంటి దేశాలు ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా పాకిస్తాన్కు ప్రయాణ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా పాకిస్తాన్ తమ దేశాన్ని సానుకూలంగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు, ఉగ్రవాదం ఇమేజ్, భద్రతా సవాళ్లతో సతమతమవుతోంది. సాంప్రదాయ దౌత్యం సరిపోని పరిస్థితిలో డిజిటల్ ఇన్ఫ్లూయెన్స్ను ఉపయోగిస్తోంది. ఈ వ్యూహం ద్వారా దేశ ఇమేజ్ను మార్చాలని, అంతర్జాతీయ సమాజంలో సానుకూల దృక్పథాన్ని సృష్టించాలని పాకిస్తాన్ భావిస్తోంది.